/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t071113601-2025-12-04-07-11-50.jpg)
Ongoing IndiGo flight delays... Passengers' difficulties
IndiGo : దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఇంకా కొనసాగుతోంది. నిన్న ఏకంగా 100కు పైగా విమానాలు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సంస్థకు చెందిన ప్రతి మూడు విమానాల్లో రెండు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారు. గత రెండు రోజుల్లోనే ఇండిగోకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దు కావడం గమనార్హం
మనదేశంలో ప్రముఖ విమానయాన సంస్థగా గుర్గింపు పొందిన ఇండిగో రోజుకు మొత్తం 2,200 విమానాలను నడుపుతున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిల్లో డిసెంబరు 2న అంటే మంగళవారం కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. ఇక అదేరోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ అధీనంలోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలే 38% సరైన సమయానికి ప్రయాణించడం గమనార్హం. ఇటీవల కాలంలో ఇండిగోకు చెందిన విమానాలు రద్దు అవడం, లేదా ఆలస్యం కావడం సర్వసాధారణమైంది. వీటిలో ఢిల్లీ- ముంబయి, దిల్లీ- బెంగళూరు, ముంబయి- బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించేవే ఎక్కువగా ఉండటంతో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. చిన్నచిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ ప్రతినిధి పేర్కొంటున్నప్పటికీ ప్రత్యాన్మయ చర్యలు తీసుకోవడంలో మాత్రం ఇండిగో అశ్రద్ధ వహిస్తోందన్న ఆరోపణలున్నాయి.
300కు పైగా ఇండిగో విమానాల రద్దు
కాగా ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్టులోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దు కావడం. మరోవైపు ముంబయి విమానాశ్రయంలో కూడా దాదాపు 33 విమానాలది ఇదే పరిస్థితి. మొత్తంగా గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమానాలు రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే క్రమ క్రమంగా తమ విమానాలు పునరుద్ధరించనున్నామని ఇండిగో వెల్లడించింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపింది.
48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక, విమానాల ఆలస్యం నేపథ్యంలో ప్రయాణీకుల నుంచి పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఎయిర్ సేవా పోర్టర్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే ఇండిగో సంస్థపై 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ల కొరతే దీనికి ప్రధాన కారణమని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వివరించింది. కొనసాగుతున్న రద్దీలను పరిశీలిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు ఇండిగో సంస్థతో కలిసి పనిచేస్తున్నామని డీజీసీఏ పేర్కొంది. కాగా విమానాల రద్దుపై విచారణ జరుపుతామని వెల్లడించింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్
కాగా వరుసగా విమానాలు రద్దవుతుండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్ నెలకొంది. హైదరాబాద్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలను ఇండిగో రద్దు చేసింది. టెక్నికల్ ఇష్యూతో 28 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. ఇండిగో సాఫ్ట్వేర్ లోపంతో రద్దు చేసినట్లు ప్రకటించింది. ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో ఎయిర్పోర్టులో 2000 మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్లైట్స్ రద్దుపై ఇండిగో సంస్థ ప్యాసింజర్స్కు ఎలాంటి సమాచారమివ్వటం లేదని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. విమానాల రద్దుతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వావాదానికి దిగారు.
Follow Us