Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టు పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కొంటా కిస్సారం అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.

New Update
Encounter

Encounter

Encounter : మావోయిస్టు పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కొంటా కిస్సారం అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర్ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఓ వైపు పార్టీ అగ్రనేతలు లొంగుబాట పడుతుండగా మరోవైపు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోవడం మావోయిస్టులను కోలుకోనివ్వడం లేదు. ఆ పార్టీ పీఎల్‌జీఏ బెలాలియన్-1 కమాండర్ బార్సె దేవా పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగానే ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మా జిల్లా కొంటా కిష్టారం అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతిచెండటం కలకలం రేపింది. మృతిచెందిన వారంతా కొంటా ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. అందులో కుంట ఏరియా కార్యదర్శి సచిన్ మంగ్డూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కోంటా ASP ఆకాష్ రావు గిరిపుంజే హత్యలో పాల్గొన్న మావోయిస్టు కమాండర్లు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయినట్లుగా సమాచారం. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులు ఎదురుపడటంతో  భీకరంగా ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో 3 AK-47, INSAS రైఫిల్స్, SLR రైఫిల్స్‌తో పాటు భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

బీజాపూర్ జిల్లాలో ఇద్దరు..
ఇదిలా ఉండగా ఈ ఎన్‌కౌంటర్‌కు ముందే బీజాపూర్ జిల్లాలో ఎస్పీ జితేంద్ర యాదవ్ పర్యవేక్షణలో దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమంది గాయపపడగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది వివిధ ఎన్‌కౌంటర్‌లలో 285 మంది నక్సల్స్ మృతి చెందారు. బస్తర్ డివిజన్‌ (ఏడు జిల్లాలు) 257 మంది మృతి చెందగా మిగతా 27 మంది రాయ్‌పూర్ డివిజన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లల్లో మరణించారు. ఇక తాజా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు