/rtv/media/media_files/2025/10/14/mallojula-surrenders-2025-10-14-11-26-54.jpg)
Mallojula surrenders
Mallojula Venugopal : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన పోలీసులకు లొంగిపోయారు. గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుసగా జరుగతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృత్యువాత పడ్డారు, వారిలో కేంద్రకమిటీ సభ్యులతో పాటు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. కాగా ఆ తర్వాత పలువురు నేతలు పోలీసులకు లొంగిపోయారు. అయితే నంబాల ఎన్కౌంటర్ తర్వాత మల్లోజుల చర్చల ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ ఇతర మావోయిస్టు నేతలు ఆయన ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా మల్లోజులను విప్లవద్రోహిగా అభివర్ణించారు. అంతేకాక ఆయుధాలు అప్పగించి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు.
కొద్దిరోజుల కిందట తన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావుకు వేణుగోపాల్రావు ఒక లేఖ రాశారు. అందులో మావోయిస్టు పార్టీ విధానాలపై వేణుగోపాల్రావు కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ మావోయిస్టు పార్టీకి ఆయన రాసిన మరో లేఖ కలకలం రేపింది. అయినా మల్లోజుల కొంతకాలంగా పార్టీ అగ్రనేతలకు లేఖలు రాస్తూ చర్చల ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే ఈరోజు ఆయన 60 మంది తన సహచర మావోయిస్టులతో కలిసి గడ్చరోలి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. గడచిన 30 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఆయన అనివార్య కారణాలతో పార్టీని వీడుతున్నానని.. ఇకపై పార్టీలో కొనసాగబోనని ప్రకటించారు. ఈ క్రమంలోనే 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు.
విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని వేణుగోపాల్ రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఆయన గతంలో రాసిన లేఖను మిగతా అగ్రనేతలైన హిడ్మా, దేవ్జీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్యే విడుదల చేయడం పార్టీలో చర్చనీయంశంగా మారింది.
ఆ లేఖలో ఏముందంటే.. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యతవహిస్తూ పొలిట్బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నా. ఇంతనష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యంగా చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. 28 ఏళ్లు కేంద్ర కమిటీ, 18 ఏళ్లు పొలిట్బ్యూరో సభ్యుడిగా పార్టీలో ఎన్నో లోపాలను గమనించాను.
1998 నుంచి ఉమ్మడి ఏపీలో దెబ్బతింటూ వచ్చాం. 2003లో ఉత్తర తెలంగాణ నుంచి బలగాలను దండకారణ్యానికి తరలించాం. 2005 నాటికి ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. మన బలాన్ని ఎక్కువగా, ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం తప్పుడు నిర్ణయం. పార్టీ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆదివాసీ రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే భూమి పట్టాలు వద్దన్నాం. దీనికి ప్రతిగా జనతన సర్కారే పట్టాలిస్తుందని చెప్పాం. కానీ ఆ పట్టాలకు విలువలేదని, రైతుల అవసరాలు తీర్చలేవని కేంద్ర కమిటీ గ్రహించలేకపోయింది. జనతన సర్కారు బడుల్లో చదువులకు కూడా విలువ లేకుండా పోయింది. చివరకు ప్రజలు ఆధార్కార్డులు తెచ్చుకోవడాన్నీ వ్యతిరేకించాం. ప్రజలు చాటుగా వెళ్లి వాటిని తెచ్చుకున్నారు. ఇలాంటి తప్పులు సరిదిద్దుకోవాలంటే ప్రజల మధ్యకు వెళ్లాలి. ఇప్పుడు ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్ను రక్షించుకోవడం కావాలి. అనవసర త్యాగాలకు అంతం పలుకుతూ నూతన పద్ధతుల్లో పురోగమిస్తే అంతిమ విజయం ప్రజలదే. ఈ లేఖ పూర్తిగా చదివి, సహచరులతో చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా’ అంటూ తోటి మావోయిస్టు నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలను సరెండర్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. ఈ లేఖల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయన ఆయుధాలు వదిలేసినట్లు గచ్చిరోలి అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
Also Read : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!