/rtv/media/media_files/2025/09/17/sensational-statement-by-maoists-2025-09-17-07-27-16.jpg)
Internal war among Maoists
Maoists : దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి సోనూఎలియాస్ అభయ్ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లేఖపై రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ స్పందిస్తూ.. ఆ లేఖ అభయ్ వ్యక్తిగతం అని.. పార్టీతో సంబంధం లేదని ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో మరోసారి అభయ్ స్పందించారు. మరో లేఖ విడుదల చేశారు.
Also Read : పండుగ పూట పెను విషాదం.. నల్గొండలో ముగ్గురు స్పాట్ డెడ్!
ఈ సందర్భంగా ఆ లేఖలో అభయ్ 'తాత్కాలిక సాయుధ పోరాట విరమణ" ప్రకటనపై జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అభినందనీయం. ఆయన దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాకే ఇంకా కట్టుబడి ఉండటంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా అభిప్రాయాన్ని కూడా మరోసారి ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు విచారిస్తున్నాను. కామ్రేడ్ నంబళ్ల కేశవరావు ప్రారంభించిన శాంతి చర్చలను నేను, నాతో పాటు కొంతమంది కామ్రేడ్స్ కొనసాగించదలచుకున్నామని మాత్రమే తెలిపాను. వారిలో కామ్రేడ్ రూపేశ్ ఒకరు. కాబట్టి ఇది పూర్తిగా పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని జగన్ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తొందరపాటుతో ఇచ్చిన ఈ ప్రకటన పార్టీ నిర్మాణ పద్ధతులకు పూర్తి భిన్నమైనది. నా సరెండర్ గురించి కూడా జగన్ మాట్లాడడం ఆయన రాజకీయ అపరిపక్వతను చాటుతోంది. కాల్పుల విరమణ ప్రకటన నా వ్యక్తిగత విషయంగా మీరు మార్చడం, మీ అమాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే అవుతుంది. కాల్పుల విరమణ ప్రకటన మన పార్టీని కాపాడుకోవడానికే తప్ప సరెండర్ల కోసం కాదు.. అందుకే ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం చొరవ చూపినట్లు అభయ్ తన లేఖలో వివరించారు.
అదే విధంగా లేఖలోనే కామ్రేడ్ జగన్కు" నా విజ్ఞప్తి ఏమంటే, కామ్రేడ్ జగన్.. 1977 ఆగస్టులో తాత్కాలిక సాయుధ పోరాట విరమణను ప్రకటిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ చేసిన తీర్మానాన్ని దయచేసి క్షుణ్ణంగా చదవండి. అందులో ఎంతో అనుభవంతో ఇలా చెప్పారు. "గత పదేళ్ల సాయుధ పోరాటంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అది దెబ్బ తిన్నది. చాలా కష్టం మీద అక్కడొకటి, ఇక్కడొకటి యాక్షన్ చేయడం తద్వారా శత్రువుకు కల్గించిన నష్టం కంటే మనం ఎక్కువ నష్టానికి గురయ్యాము. ప్రజా పునాది ప్రాముఖ్యతను.. మన కేడర్ గుర్తించకపోవడం దీనికి ముఖ్య కారణం. ఆ సంబంధాలే ఉంటే, ఒకసారి దెబ్బతిన్న ప్రాంతంలో అతి దీర్ఘకాలం సంబంధాలు నెలకొనకపోవడం జరుగదు" అని అందులో ఉంది. ఈ నేపథ్యంలో మనం తెలంగాణ విప్లవోద్యమాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ పునరాభివృద్ధి కోసం పాటుపడాలనీ కోరుతున్నాను.. అని అధికార ప్రతినిధి అభయ్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బాక్సర్ మేరీ కోమ్ ఇంట్లో చోరీ.. సీసీఫుటేజ్లో షాకింగ్ విజువల్స్