Hidma encounter : హిడ్మా ఎన్‌కౌంటర్‌ ద్రోహుల పనే...మావోయిస్టుల సంచలన లేఖ

హిడ్మా ఎన్ కౌంటర్‌ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ ఎన్ కౌంటర్ కు నమ్మక ద్రోహమే కారణమని తేల్చి చెప్పింది. ఒక కలప వ్యాపారి, ఐటీడీఏ కాంట్రాక్టర్, బిల్డర్లు నమ్మించి మోసం చేశారని ఆరోపించింది. కాగా హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

New Update
FotoJet - 2025-12-05T121223.401

Hidma encounter is the work of traitors...Maoists' sensational letter

 Hidma encounter : హిడ్మా ఎన్ కౌంటర్‌ పై మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. ఏపీలోని మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, శంకర్‌ హత్యలపై న్యాయ విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్ష విధించాలని పార్టీ డిమాండ్‌ చేసింది. . ఈ మేరకు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరుతో గతనెల 27న జారీ చేసిన లేఖ వెలుగులోకి వచ్చింది. హిడ్మా హత్యకు దేవ్‌జీ కార ణమంటూ మనీశ్‌ కుంజాం, సోనీసోరి చేసిన ఆరో పణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పార్టీ పేర్కొంది. అంతేకాదు హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని కూడా తేల్చి చెప్పింది.

చికిత్సకోసం విజయవాడకు వెళ్లి..

అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మా విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారిని నమ్మి చికిత్స కోసం అక్టోబర్‌ 27న విజయవాడకు వెళ్లినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. అనంతరం మరికొంతమంది మావోయిస్టులు కూడా అక్కడికి చేరుకున్నారని తెలిపింది. అయితే నిరాయుధులైన హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు పట్టుకొని హత్య చేశారని వికల్ప్‌ ఆరోపించారు. వారిని ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తప్పుడు కథ అల్లాన్నారు. నవంబర్‌ 19న అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో ఏడుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు కట్టు కథ అల్లారని ప్రకటించారు. ఈ ఘటనలోనూ నిరాయుధులైన ఏఓబీ (ఆంధ్రా–ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ) సభ్యుడు శంకర్, మరో ఆరుగురిని పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని ఆరోపించారు. 

 నమ్మిన వారే  ద్రోహం చేశారు

కాగా నవంబర్‌ 9న మావోయిస్టు  బలగాల నుంచి కోసల్‌ అనే సభ్యుడు పారిపోయినట్లు వికల్ప్‌ లేఖలో పేర్కొన్నారు. అతను నేరుగా వెళ్లి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్‌ అయ్యాడన్నాడు. ఆయనకు హిడ్మా ప్రయాణ వివరాలన్నీ తెలుసు. దీంతో వెంటనే అడవిలోకి వచ్చేయాలని పార్టీ తరఫున హిడ్మాకు సమాచారం ఇచ్చాం. ఈ సమాచారం ఆయనకు నవంబర్‌ 14న మధ్యాహ్నం అందింది. ఆ వెంటనే అడవిలోకి తిరిగి వచ్చేందుకు హిడ్మా  ప్రయత్నించాడు. అదేరోజు సాయంత్రం 4–5 గంటల సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారన్నారు. అనంతరం  పోలీసుల చేతిలో చనిపోయారు. మరో మావోయిస్టు నేత శంకర్‌ విషయంలోనూ ఇలాగే జరిగిందని తెలిపారు.  అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, విజయవాడలోని కలప ఫర్నిచర్‌ వ్యాపారి, బిల్డర్లు 50 మంది మావోయిస్టుల అరెస్ట్‌కు కారణమని ఆరోపించారు. వీరే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తామని తీసుకెళ్లి పోలీసులకు చెప్పారన్నారు. ఫలితంగా ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులు పట్టుబట్టారు. ఈ వ్యవహారమంతా ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు తెలుసు అని వికల్ప్‌ వివరించారు.

న్యాయ విచారణ జరిపించాలి

ఈ మొత్తం కుట్ర వెనుక ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోందని వికల్ప్‌ తెలిపారు. హిడ్మా, శంకర్‌తోపాటు మొత్తం 13 మందిని అరెస్టు చేసి నకిలీ ఎకౌంటర్లు చేశారన్నారు. ఈ హత్యలకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద అధికారులు బాధ్యులు. ఈ ఆపరేషన్‌ విజయవంతం కావడానికి విదేశీ కాపలాదారులు కూడా సహకరించారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో అరెస్ట్‌ అయిన వారిలో దేవ్‌జీ, సంగ్రామ్‌ లేరని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. కానీ హిడ్మా మరణానికి దేవ్‌జీ కారణం అనే ప్రచారం జరగడం, దానికి సోని సోరి, మనీశ్‌ కుంజమ్‌ లాంటి నేతలు వంత పాపడటం రాజ్యం పన్నిన కుట్రలో భాగమే’అని మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఆ లేఖలో వెల్లడించింది. కాగా మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డిలు తమతోనే ఉన్నారని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు