One Nation One Election : వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలెక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.

New Update
centre-approved-one-nation-one-election-proposal

One Nation – One Election: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు… ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో  ఒకేసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగగా… మిగతా రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు. 

32 పార్టీలు ఒకే..

ఈ ప్రతిపాదనపై పని చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మార్చిలో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ కమిటీ 62 రాజకీయ పార్టీలను సంప్రదించింది. వీరిలో 32 మంది ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. కాగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు స్పందించలేదు. అందులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ (ఆర్) పెద్ద పార్టీలు. జేడీయూ, ఎల్జేపీ (ఆర్‌)లు ఒకే దేశం, ఒకే ఎన్నికలకు అంగీకరించగా, టీడీపీ మాత్రం దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. JDU, LJP (R) ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి, ఇది సమయం మరియు డబ్బు ఆదా చేస్తుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, బీఎస్పీ సహా 15 పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా, టీడీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా 15 పార్టీలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

కమిటీ సిఫార్సులు..

* లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి.
* స్థానిక సంస్థల ఎన్నికలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు వంటివి) 100 రోజులలోపు నిర్వహించాలి.
* ఈ సిఫార్సుల అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి.
* ఉమ్మడి ఓటరు జాబితా, ఒకే ఓటరు గుర్తింపు కార్డు వ్యవస్థ ఉండాలి, దీనిని కేంద్ర ఎన్నికల సంఘం (ECI), రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదించి తయారు చేయాలి వంటి ముఖ్యమైన అంశాలను కేంద్రానికి సిఫార్సు చేసింది.

భారీ ఖర్చు.. అభివృద్ధికి ఆటంకం..

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అది పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అయితే, ఎన్నికల నిర్వహణకు భారీ మొత్తం లో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీని వల్ల ప్రజాధనం వృధాగా ఖర్చు అవుతోందని ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఒకసారి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే భారీగా ఖర్చు తగ్గుతుందని.. అలాగే అభివృద్ధికి ఆటంకం కలగదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచి చూడాలి. కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది.

Advertisment
తాజా కథనాలు