Telangana: రుణమాఫీ కానివారు ఆందోళన పడొద్దు.. వ్యవసాయశాఖ కీలక ప్రకటన

తెలంగాణలో రైతు రుణమాఫీ కానివారి కోసం వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రూ.2 లక్షల లోపు రుణమాఫీ కానివారు మండల వ్యవసాయ అధికారికి దరఖాస్తు పెట్టుకోవాలని సూచించింది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొంది.

New Update
Telangana: రుణమాఫీ కానివారు ఆందోళన పడొద్దు.. వ్యవసాయశాఖ కీలక ప్రకటన

తెలంగాణలో రైతు రుణమాఫీ కొందరికి జరగడం, మరికొందరికి జరగకపోవడంపై రేవంత్ సర్కార్‌పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం అవరసం లేదని.. అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. "రూ.2 లక్షల లోపు రుణాల వరకు అర్హులైన రైతులకు సంబంధించిన రుణాలకు ప్రభుత్వం నెలరోజుల్లోనే మాఫీ చేసింది. దాదాపు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ అయ్యింది. జులై 18న రూ.లక్ష లోపు రుణాలు, జులై 30న రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసింది. ఆగస్టు 15న రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది.

రూ.31 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.18 వేల కోట్లతో సరిపెట్టిందని.. రుణమాఫీపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దు. ఇంకా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం చివరి విడతలో.. రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతుల కూడా రుణమాఫీ వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే. ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.2 లక్షలు బ్యాంకులో జమ చేస్తుంది. వీరిని కలుపుకుంటే రుణమాఫీ మొత్తం మరింత పెరుగుతుంది. అర్హులైన రైతులందరికీ పూర్తిగా రుణ విముక్తి అవుతుంది.

Also read: కాంగ్రెస్‌ శ్రేణులకు మళ్లీ నిరాశ.. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే !

ఇప్పటివరకు రూ.2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాసు బుక్ సరిగ్గా, స్పష్టంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ రుణమాఫీ జరిగింది. ఇందులో సందేహం ఎలాంటి సందేహం లేదు. బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి, వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది.

బ్యాంకుల్లో టెక్నికల్ కారణాల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయి. వీటిలో ఉన్న చిన్న చిన్న తప్పులను గుర్తించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరి చేస్తుంది. ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసింది. అందుకే రూ.2 లక్షల లోపు రుణాలుండీ ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి.. అందుకు కారణం తెలుసుకోవాలి. రూ.2 లక్షల లోపు రుణమున్నప్పటికీ, మాఫీ కాని రైతులెవరైనా ఉంటే మండల వ్యవసాయ అధికారిని (MAO) కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్‌లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణ మాఫీ వర్తించిందా ? లేదా ? వర్తించకపోవడానికి కారణమేమిటో ఉంటుంది.

Also Read: కాంగ్రెస్‌ శ్రేణులకు మళ్లీ నిరాశ.. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే !

ఒకవేళ ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్‌తో పాటు, ఓటర్ ఐడీ లేదా వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఏవోకు అందించాలి. వాటిని పోర్టల్లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే.. ఎంఏవో క్షేత్రస్తాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకోని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆధార్‌లో, బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిగాలేకపోతే, రైతులు సరైన పేరున్న అప్​ డేటేడ్​ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది.

Advertisment
తాజా కథనాలు