INDvsAFG: ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అంత ఈజీ కాదు: రోహిత్

మొహలీలో తీవ్రమైన చలి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టిందని రోహిత్ శర్మ అన్నారు. 'మేము అనుకున్నదానికంటే ఎక్కువగానే చలి నమోదైంది. మ్యాచ్‌ జరుగుతున్నపుడు ఉష్ణోగ్రత దాదాపు 9 డిగ్రీలకు పడిపోయింది. బంతి తాకితే విపరీతమైన నొప్పి కలిగింది. ఇది కఠినమైన సవాల్' అని చెప్పారు.

New Update
INDvsAFG: ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అంత ఈజీ కాదు: రోహిత్

INDvsAFG: మొహలీ (mohali) వేదికగా తీవ్రమైన చలిలో మ్యాచ్ ఆడటంపై ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన భారత్ -అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) తొలి టీ20 మ్యాచ్‌ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ విపరీతమైన చలి, మంచు ఇరుజట్ల ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు.

అనుకున్నదానికంటే ఎక్కువే..
'మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మొహాలిలో ఉష్ణోగ్రత దాదాపు 9 డిగ్రీలకు పడిపోయింది. మేము అనుకున్నదానికంటే ఎక్కువగానే చలి నమోదైంది. బంతి శరీరంలో ఎక్కడ తాకినా.. విపరీతమైన నొప్పి కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయడం అంత ఈజీ కాదు. మా స్పిన్నర్లు చాలా అద్భుతంగా వేశారు' అని చెప్పారు. అలాగే తాను రనౌట్‌ కావడం నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పిన కెప్టెన్.. 'ఆ సమయంలో చాలా కోపం వచ్చింది. జట్టు కోసం పరుగులు చేయలేకపోయినందుకు బాధగా అనిపించింది. ఎలాగైనా విజయం సాధించడమే ముఖ్యం. గిల్‌ ఎక్కువ సమయం బ్యాటింగ్‌ చేయాలని కోరుకున్నా. అతడు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. శివమ్‌ దూబె, జితేశ్‌, రింకు, తిలక్ మంచి ఫామ్‌ను కొనసాగించారు. ప్రస్తుతం నా పరిస్థితి ఓకే. విజయంతో మేం మ్యాచ్‌ ముగించినందుకు ఆనందంగా ఉంది'అని రోహిత్‌ వివరించారు.

ఇది కూడా చదవండి : Venu Swamy : నయనతార కాపురంలో చిచ్చురేపిన వేణుస్వామి.. విడాకులు తప్పవంటూ

చాలా ఇబ్బందులు పడ్డాం..
ఇక ఈ మ్యాచ్ విన్నర్ శివం దూబె మాట్లాడుతూ.. 'ఈ గ్రౌండ్ లో ఆడటాన్ని చాలా ఎంజాయ్‌ చేశా. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఇబ్బందిపడలేదు. ఫీల్డింగ్‌ సమయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించినా.. తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా. భారీ సిక్స్‌లు కొట్టగలననే నమ్మకముంది. బౌలింగ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగా’ అని చెప్పాడు. బౌలింగ్‌లో ఒక వికెట్‌ తీసిన దూబె.. బ్యాటింగ్‌లోనూ హాఫ్ సెంచరీ (60*)తో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు.

publive-image

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం అలవాటుగా మారిపోయిందని చెప్పిన రింకూసింగ్.. ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగి పరుగులు రాబట్టడం ఎప్పుడూ ఆస్వాదిస్తుంటానని తెలిపాడు. ఈసారి తక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం వచ్చింది. గతంలో ధోనీతో చాలాసార్లు దీని గురించి చర్చించాను. బంతిని బట్టి బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవాలని మాజీ కెప్టెన్‌ సూచించాడు. ఇప్పుడు తాను ఆచరిస్తున్నానని  రింకు సింగ్‌ తెలిపాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ 5 వికేట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆనంతరం లక్ష్య చేధనలో 4 వికెట్లు కొల్పోయిన భారత్ కుర్రాళ్లు రాణించడంతో 17.3 ఓవర్లలో ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టీ20 ఆదివారం జరుగనుంది.

Advertisment
తాజా కథనాలు