Israel-Hamas war: ఉత్తరం అయిపోయింది...దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్

గాజాలో పరిస్థితి దారుణంగా ఉంది. హమాస్ ను ఎలా అయినా మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు ఉత్తర గాజాలో దాడులు చేసిన ఐడీఎఫ్ ఇప్పుడు దక్షిణ గాజామీద కూడా విరుచుకుపడుతోంది.

New Update
Israel-Hamas war: ఉత్తరం అయిపోయింది...దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్

Israel-Hamas war: వైమానిక, హూతల దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. ఇళ్ళు, భవనాలు నేల మట్టం అవుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్య ప్రజలు వేలల్లో క్షతగాత్రులుగా మారుతున్నారు. అయినా కూడా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు హమాస్ (Hamas) కూడా తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్ ఉత్తర గాజా (Gaza) నుంచి దక్షిణం వైపుకు మరలుతున్నారు. అక్కడి నుంచి కూడా ప్రజలు వెళ్ళిపోవాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తోంది ఐడీఎఫ్.

Also Read:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పోలింగ్ ప్రారంభం

యుద్ధం ప్రారంభంలో ఉత్తర గాజా నుంచి పాలస్తీనియన్లు దక్షిణ గాజాకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా దాడులు చేస్తామని చెబుతుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక అయోమయంలో ఉన్నారు. మరోవైపు ఉత్తర, దక్షిణ గాజా అనే తేడా లేకుండా హమాస్‌ మిలిటెంట్లు ఎక్కడ దాగి ఉన్న దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గల్లాంట్‌(Yoav Gallant) స్పష్టంచేశారు. ఇక గాజా ప్రజలను తమ భూభాగంలోకి అనుమతించే ప్రసక్తే లేదని పొరుగు దేశం ఈజిప్టు మరోసారి తెగేసి చెప్పింది.

అటువైపు గాజాలో పరిస్ధితులుకూడా దయనీయంగా ఉన్నాయి. ఆసపత్రులన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. గాజాలో మొత్తం 35 ఆసుపత్రులు ఉంటే 26 పని చేయడం లేదు. మిగతా వాటిల్లో కూడా కరెంట్ లేక, మందుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. దీనివల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో ఇప్పటివరకు 12,000 మందికిపైగా మరణించారు. 2,700 మంది అదృశ్యమయ్యారు. వీరంతా శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.

ఇక ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం (Israel-Hamas war) విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) తీర్మానం ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల గాజాలో సామాన్య పాలస్తీనియన్లు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని మండలి ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించేందుకు గాజా అంతటా ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయాలని, వారికి తగిన రక్షణ కల్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు సూచిస్తూ మండలిలో తీర్మానాన్ని ఆమోదించారు. బందీలను వెంటనే విడుదల చేయాలని ఈ తీర్మానంలో హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. మండలిలో 15 సభ్యదేశాలుండగా, మాల్టా దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతుగా 12 దేశాలు ఓటువేశాయి. అమెరికా, యూకే, రష్యా దేశాలు అసలు ఓటింగ్ కు హాజరు కాలేదు.

Also Read:వామ్మో వెండి కొనేట్టులేదుగా..బంగారం ధరా పెరిగింది..తాజాగా ఇలా..

Advertisment
తాజా కథనాలు