ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదన్నారు. పరిస్థితి దాటకముందే తమతో చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్కు చాలా అవకాశాలు ఇస్తూ వచ్చామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతకమైన అత్యాధునిక ఆయుధాలు తాము తయారు చేస్తున్నామన్నారు. ఆ ఆయుధాలు చాలా వరకు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని.. వాటిని ఎలా ఉపయోగించాలో ఇజ్రాయెల్కు తెలుసునన్నారు. ఒప్పందం చేసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్ని చెప్తున్నప్పటికీ కొందరు ఇరాన్ నేతలు తాను చెప్పే మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు.
భవిష్యత్లో ఏం జరుగుతుందో
భవిష్యత్లో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మారణహోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందన్నారు. తాను చెప్పినట్లు వింటే మరణాలు, విధ్వంసాలు ఉండవని తెలిపారు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరాన్పై వరుస దాడులకు ఇజ్రాయెల్ దిగుతుంది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులుకు పాల్పడుతుంది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి చెందాడు. మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ సైతం హతమయ్యాడు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడులకు దిగింది.