ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ ఇప్పుడు అందరి దృష్టి అమెరికాపై ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ మధ్య ఇటీవల జరిగిన వైట్ హౌస్ సమావేశం చర్చనీయాంశంగా మారింది. మునీర్ను అధికారికంగా ట్రంప్ కు లంచ్ కు ఆహ్వానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలావుంటే అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ (పెంటగాన్) మాజీ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ విశ్లేషకుడు మైఖేల్ రూబిన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్పై సైనిక చర్య తర్వాత, దాని అణు కార్యక్రమానికి సంబంధించిన సామగ్రిని పాకిస్తాన్కు తరలించడం సాధ్యమవుతుందని ట్రంప్ పరిపాలన పాకిస్తాన్పై దృష్టి సారించిందంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
వ్యూహాత్మక సహకారం కోరుకునేందుకే
ఇరాన్కు వ్యతిరేకంగా వ్యూహాత్మక సహకారం కోరుకునేందుకే ట్రంప్, అమెరికా దళాల సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారులు పాకిస్తాన్తో మాట్లాడుతున్నారని మైఖేల్ రూబిన్ కామెంట్స్ చేశారు. " ఈ స్నేహం నుండి ఏదో ఒకటి పొందాలి కాబట్టి డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ను స్నేహితుడు అని పిలుస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఇది జరిగితే, అమెరికా అణు పదార్థాలను ఎక్కడికో తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికి పాకిస్తాన్ను ఎంచుకునే అవకాశం ఉంది" అని రూబిన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకపై స్వతంత్ర దేశం కాదని మైఖేల్ రూబిన్ అన్నారు. అది చైనాకు ప్రాక్సీగా మారిందని ఆరోపించారు. అటువంటి పరిస్థితిలో మునీర్ ట్రంప్ను కలిసినప్పుడు, అతను చైనా నుండి అమెరికాకు కొన్ని రహస్య సందేశాలను కూడా పంపి ఉండవచ్చనని అనుమానాలు వ్యక్తం చేశారు.
ట్రంప్ హెచ్చరిక
తాజాగా ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. మా బాంబులతో ఇరాన్ నేలమట్టమవుతుందని తెలిపారు. '' ఇజ్రాయెల్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చేయడం నా నిర్ణయం కాదు. న్యూక్లియర్ లేకుండా చేయడమే మా లక్ష్యం. మేము యుద్ధంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా బాంబులతో ఇరాన్ నేలమట్టం అవుతుందని'' అన్నారు. అయితే ఇజ్రాయెల్తో పాటు ఇరాన్పై యుద్ధానికి దిగాలని గతంలోనే ట్రంప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలా దాడి చేయాలని ముందుగానే ట్రంప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు. ఇక వచ్చే వారంలో ట్రంప్ కీలక చర్యల దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.