/rtv/media/media_files/2026/03/01/dubai-2026-03-01-06-35-15.jpg)
ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల ప్రభావం దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలపై పడింది.దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై బాలిస్టిక్ మిసైళ్లతో అటాక్ చేసింది. దీంతో విమానాశ్రయం లోపల కొంతభాగం దెబ్బతింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు అధికారాలు ప్రకటించారు. ఈ క్రమంలో విమానాలను పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికులను అక్కడి నుంచి తరలిస్తున్నారు.
క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల దుబాయ్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతేకాకుండా, దుబాయ్కు గర్వకారణమైన బుర్జ్ అల్ అరబ్ హోటల్పై డ్రోన్ శకలాలు పడటంతో హోటల్ బయటి భాగంలో మంటలు చెలరేగాయి. గాలిలో డ్రోన్ను అడ్డుకున్న సమయంలో దాని అవశేషాలు హోటల్ పై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఇక్కడ ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.
జెబెల్ అలీ పోర్టు వద్ద
యూఏఈ రాజధాని అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన దాడిలో ఒక ఆసియా దేశస్థుడు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మొదట ఈ విషయాన్ని అధికారులు సోషల్ మీడియాలో వెల్లడించినప్పటికీ ఆ తర్వాత ఆ పోస్ట్ను తొలగించడం గమనార్హం. మరోవైపు, దుబాయ్లోని కీలకమైన జెబెల్ అలీ పోర్టు వద్ద కూడా క్షిపణి శకలాలు పడటంతో ఒక రేవు వద్ద మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఈ దాడుల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో గగనతలం దాదాపు ఖాళీ అయిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్, అబుదాబి, దోహాలకు వెళ్లే విమానాలను ఎయిర్ లైన్స్ సంస్థలు రద్దు చేశాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, యుద్ధం మరింత పెరగకుండా చర్చలు జరపాలని కోరుతోంది.
Follow Us