Doomsday aircraft: ఏ దేశానికో మూడింది.. ఆకాశంలో అమెరికా అరుదైన యుద్ధ విమానం

ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలోకి అమెరికా వెళ్తోందని వార్తలు వస్తున్నాయి. అమెరికా అత్యంత శత్రు దర్భేద్య విమానం డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ మంగళవారం కనిపించింది. లూసియానాలోని బోస్సియర్‌ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకుంది.

New Update
Doomsday Plane

ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం మధ్య అమెరికా కలుగజేసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా అమెరికాలో అత్యంత శత్రు దర్భేద్య విమానం అయిన డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ కనిపించింది. ఇది ఈ–4బీ రకానికి చెందిన విమానం. డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా అగ్రరాజ్య గగనతలంలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా బాంబులేస్తే ప్రతిదాడిగా ఇరాన్‌ సైతం అమెరికాపై బాంబుల వర్షం కురిపించొచ్చు. అలాంటి సందర్భాల్లో గాల్లో చక్కర్లు కొడుతూనే అమెరికా రక్షణ మంత్రిసహా కీలక ఉన్నతాధికారులు పాలన సాగించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తారు. 

ప్రత్యేకతలివే

ఈ విమానాన్ని బోయింగ్‌ 747–200బీ మోడల్‌లో మార్పులు చేసి తయారు చేశారు. అమెరికాలో యుద్ధంవస్తే ఆపదకాలంలో వాడే విమానం కాబట్టి దీనికి డూమ్స్‌డే ఎయిర్‌క్రాఫ్ట్‌ అనే పేరుంది. దీనికి నైట్‌వాచ్‌, ఫ్లయింగ్‌ పెంటగాన్‌ అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ విమానం మంగళవారం లూసియానాలోని బోస్సియర్‌ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకుంది. ఈ విమానం ఏకధాటిగా 7,000 మైళ్ల దూరం ప్రయాణించగలదు. సిబ్బంది సహా 112 మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంది. 

గతంలో ఈ విమానం అత్యధికంగా ఏకధాటిగా 35 గంటలపాటు ఎగిరింది. శత్రుదాడులను తట్టుకునేలా అంటే సైబర్‌ దాడులు, అణుబాంబుపేలుళ్ల ప్రకంపనలు, విద్యుదయస్కాంత ప్రభావాలకు లోనుకాకుండా దీనిని పటిష్టంగా నిర్మించారు. న్యూక్లియర్, థర్మల్‌ కవచాలు దీనికి తొడిగారు. గాల్లో ప్రయాణిస్తూనే ఇందులోని అధికారులు ప్రపంచం నలుమూలల ఉన్న స్వదేశీ, విదేశీ నేతలు, అధికారులకు ఆదేశాలు జారీచేయొచ్చు. దీనిలో ఏకంగా 67 ఉపగ్రహ డిష్‌ వ్యవస్థలు ఉన్నాయి.

యుద్ధవిమానంగా.. 

అత్యవసర సందర్భాల్లో యుద్ధవిమానంగానూ మారిపోతుంది. వెంటబడే శత్రు విమానాలపై బాంబులను ప్రయోగించగలదు. మళ్లీ ల్యాండింగ్‌ చేయాల్సిన పనిలేకుండా గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ మొత్తం విమానంలో ఉన్నతాధికారుల విశ్రాంతి కోసం 18 పడకలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పెద్ద సమావేశ గది ఏర్పాటుచేశారు. ఈ విమానం మొత్తంగా మూడు అంతస్తుల్లో ఉంటుంది. 9/11 దాడుల తర్వాత ఈ సిరీస్‌ విమానంలో నాటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ పలుమార్లు ప్రయాణించారు. 1995లోనూ హరికేన్‌ ఓపెల్‌ ఘటన సమయంలో ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ఉన్నతాధికారులు ఇందులోంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వాయుసేనలో ఇలాంటివి నాలుగు విమానాలు ఉన్నాయి. యుద్ధ సన్నద్థతను పరీక్షించేందుకే ఈ విమానాన్ని వాషింగ్టన్‌కు తీసుకొచ్చారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు