సిరియాలో నియంత అసద్ పాలన ముగిసింది. అక్కడ అల్లకల్లోలంగా ఉన్న వాతావరణం, ప్రజలపై హింస ముగిసిన ఇక హాయిగా ఉంటుంది అనుకున్నారు అంతా. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అసద్ పోయినా అతని అనుకూలవాదులు మాత్రం వదలడం లేదు. భద్రత దళాలతో ఘర్షణలు పడుతూనే ఉన్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరి మధ్యనా తీవ్ర ఘర్షణలు, ప్రతీకార దాడులు చోటు చేసుకున్నాయి. దీనివలన రెండు రోజుల్లోనే ఏకంగా 600మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటన ఇదేనని చెబుతున్నారు.
ఎక్కడపడితే అక్కడే మృతదేహాలు..
సిరియాలో బషర్ అసద్ పాలన అంతం అయిన మూడు నెలల వరకు అంతా బాగానే ఉంది. భద్రతా దళాల సంరక్షణలో అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ మూడు నెలల తర్వాత నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. అసద్ మద్దతుదారులు తీవ్రంగా దాడులు చేస్తున్నారు. వీటిని తీవ్రంగా పరిగణించిన ప్రస్తుత ప్రభుత్వం వారిని సమర్ధవంతంగా ఎదుర్కోంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వ అనుకూల ఫైటర్లు అసద్ విధేయులైన అలవైట్ వర్గంపై ప్రతీకార దాడులు మొదలుపెట్టడం తీవ్ర హింసకు దారితీసింది. ఇరు వర్గాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి బనీయాస్ లో చోటు చేసుకున్న హింసలోనూ చాలా మంది చనిపోయారు. అక్కడి వీధులు, బిల్డింగ్ లు అన్నీ మృతదేహాలతో నిండిపోయి ఉన్నాయి. వాటిని తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మృతదేహాలను ఖననం చేయనివ్వకుండా గన్ మెన్ లు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.