Telangana: హైడ్రా చర్యలు వేగవంతం.. పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి ?

చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. నగరంలోని పలు చెరువుల వద్ద ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలో పేద, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉంటున్నాయి. ఒకవేళ హైడ్రా వీళ్ల ఇళ్లపై కూడా చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Telangana: హైడ్రా చర్యలు వేగవంతం.. పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి ?
New Update

చెరువులను ఆక్రమించిన నిర్మాణాలపై హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే నగరంలో పలు ఆక్రమణలు అధికారులు కూల్చివేశారు. అలాగే శనివారం మాదాపూర్‌లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ ఫంక్షన్ హాల్‌ను కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక నేత కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఫంక్షన్‌ హాల్‌ను అధికారులు నేలమట్టం చేశారు.

Also Read: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం: మోదీ

తమ్మిడికుంట చెరువులోని ఎన్‌కన్వెన్షత్‌తో పాటు చుట్టు పక్కల ఉన్న పలు ఇతర కట్టడాలను కూడా అధికారులు కూల్చేశారు. మెటల్ చార్మినర్ లోపలివైపు ఉన్న స్క్రాప్ గోదాములు, వర్క్‌షాపులు, అలాగే నీటిని తోడి ట్యాంకర్లకు విక్రయించే షెడ్లు.. తదితర వాటిని కలిపి మొత్తం 20కి పైగా నిర్మాణాలను నేలమట్టం చేశారు. చెరువు వెనుక భాగాన భారీగా పేరుకుపోయిన జీవ వ్యర్థాల మూటలను చూసి అధికారులు షాకయ్యారు. గోశాల, క్రికెట్ నెట్లు, ఇతరత్రా నిర్మాణలు, అలాగే టీఎస్‌ఐఐసీ వైపు నుంచి చెరువులోకి చొచ్చుకొస్తున్న చెత్తకుప్పులు, నిర్మాణ వ్యర్థాల గుట్టల అంశంలో కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏంటి

ప్రతి చెరువుకు కూడా నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని ఫుల్ ట్యాంకు లెవల్ (FTL) అని అంటారు. ఆ తర్వాత చెరువు పరిధిని బట్టి కొన్ని మీటర్ల మేరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న పలు చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లలో పట్టా భూములు కూడా ఉన్నాయి. అయితే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో పట్టా భూమి ఉన్నప్పటి కూడా నీటి పారుదల శాఖ నిబంధనలు ప్రకారం అందులో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ప్రైవేటు లేదు పట్టా భములు ఉన్నప్పటికీ.. అక్కడ కేవలం వ్యవసాయం లేదా మొక్కలు పెంచుకోవడం, నర్సరీలు ఏర్పాటు చేసుకునేందుకు మాత్రం అనుమతి ఇస్తారు.

కానీ పలువురు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో అక్రమంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు కూడా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో ఉన్నాయి. మరి వీళ్ల పరిస్థితి ఏంటి. ఒకవేళ హైడ్రా వీరి ఇళ్లను కూడా కూల్చివేస్తే వాళ్ల జీవన పరిస్థితి ఏమవుతుంది ?. చాలావరకు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా చెరువుల దగ్గర నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా చూసే బాధ్యత జీహెచ్‌ఎంసీ, ఇతర అధికారులకు ఉంటుంది. ఇప్పుడు చాలావరకు వీటి పరిధిలో నిర్మాణాలు జరిగాయి.

Also Read:  హైడ్రా అధికారులకు హరీష్ రావు స్వీట్ వార్నింగ్!

దీన్నిబట్టి చూస్తే చెరువులను ఆక్రమించి కట్టడాలు నిర్మించిన వారితో పాటు వీటికి పర్మిషన్ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులది కూడా తప్పే అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పలువురు బడా బాబులు చెరువులు ఆక్రమించి కట్టిన ఇళ్లను ఇతరులకు అమ్మేసి ఉంటారు, లేదా వారు నిర్మించిన ఇళ్లల్లో అద్దెకు ఉండేవారు ఉంటారు. దీనివల్ల అక్కడ నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. కాబట్టి వీళ్లు ఉండే ఇళ్లలో హైడ్రా చర్యలు చేపట్టినట్లేతే వీరికి ప్రత్యామ్నాయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

#hydra #telangana #hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe