Harish Rao: దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదల

సిద్ధిపేట జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మంజూరు కాపీలను మంత్రి హరీష్‌రావు దేవాలయ అధికారులకు అందజేశారు. సీఎం కేసీఆర్‌ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.

New Update
Harish Rao: దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదల

సిద్ధిపేట జిల్లాలోని పలు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదుల చేసినట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఆదివారం సిద్ధిపేట నియోజకవర్గంలో ఆలయ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి.. వారికి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అనేక దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటికే 50కి పైగా దేవాలయాల అభివృద్ధికి నిధులు విడుదలైనట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా తాను వ్యక్తిగతంగా వందల సంఖ్యలో దేవాలయాల అభివృద్ధి కోసం సహకారం అందించానన్నారు.

సిద్ధిపేట నియోజకవర్గంలో మరో ఆరు దేవాలయాల అభివృద్దికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. సిద్దిపేటలో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చామన్నారు. ఆలయాలకు, ఆధ్యాత్మికతకు నెలవు సిద్దిపేట అని మంత్రి తెలిపారు. కాగా సిద్దిపేట నియోజకవర్గంలో చిన్నకోడూర్ మండలం సలేంద్రి గ్రామంలో అతి ప్రాచీన ఆలయమైన శ్రీ శివాలయం అభివృద్ధికి ప్రభుత్వం 50 లక్షలు మంజూరు చేసింది. అంతే కాకుండా విఠలాపూర్ గ్రామంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగియున్న శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయానికి 42 లక్షల రూపాయలను మంజూరు చేసింది. నారాయణ రావు పేట మండలంలోని పురాతన అలయమైన శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామీ ఆలయానికి 39 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం.. సిద్దిపేట పట్టణంలోని శ్రీ పెద్దమ్మ దేవాలయం అభివృద్ధికి 30 లక్షల రూపాయలను కేటాయించింది. హనుమంతు పల్లి ఇరుకోడ్ లోని పెద్దమ్మ ఆలయాన్ని ఇప్పటికే అభివృద్ధి చేయగా.. మిగిలివున్న పనుల కోసం 20 లక్షల రూపాయలను మంజూరు చేసింది. సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని శ్రీ మహంకాళి దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం 17.50 లక్షలు మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనుంది.

మరోవైపు రానున్న రోజుల్లో ఈ దేవాలయాలు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలా అభివృద్ధి చెందాలని మంత్రి హరీష్‌ రావు ఆకాంక్షించారు. కాగా విపక్ష నేతలు దేవాలయాలను సైతం రాజకీయం చేస్తారన్నారు. విపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. వారి నోటికి అద్దూ అదుపూ అంటూ ఏవీ ఉండవని మంత్రి మండిపడ్డారు. నోరుకు ఏది వస్తే అదే మాట్లాడుతారని విమర్శించారు. గత ప్రభుత్వం దేవాలయాలను ఎప్పుడైనా పట్టించుకుందా అని మంత్రి ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధిని పట్టించుకోని పార్టీలకు ప్రశ్నించే హక్కు లేదని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు