CM Revanth: కాంగ్రెస్‌ మాట శిలాశాసనం.. రుణమాఫీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని మరొక్కసారి రుజువైందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. మొదటిదశలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు వెల్లడించారు.

CM Revanth: కాంగ్రెస్‌ మాట శిలాశాసనం.. రుణమాఫీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
New Update

Telangana: రైతు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్‌ గురువారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి రైతులతో మాట్లాడిన ఆయన.. తొలివిడతగా రూ.1లక్ష లోపు రైతు రుణాల మాఫీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని అన్నారు.

రైతు డిక్లరేషన్‌లో భాగంగా రుణమాఫీ..

ఈ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నాం. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేశాం. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది. ఇది నా జీవితంలో మరుపురాని రోజు. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి రూ.లక్షన్నర రుణాలను మాఫీ చేస్తాం. పాస్‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ ఉంటుంది. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్‌ కార్డు ప్రామాణికం. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవు. అందుకే పాస్‌బుక్‌ను ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు.

ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు..

ఇక ఆగస్టు మొదటి వారంలో రూ.లక్షన్నర లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌ చిత్ర పటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరో వైపు రుణ మాఫీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన గౌడ్ లైన్స్ పై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్‌ సర్కార్‌కు పలు ప్రశ్నలు సంధించారు. లక్షలోపు రుణాలు ఉన్న రైతులు రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మంది ఉంటే 11 లక్షల మంది రైతులను మాత్రమే ఎలా ఎంపిక చేశారు? అని ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాల మాఫీ కోసం రూ.16,144 కోట్లు ఖర్చు చేసి 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సోనియమ్మకు తెలుసు..

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫీ పైన సంతోషం వ్యక్తం చేశారు. గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నారు. మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి నిరూపణ అయిందని చెప్పారు. నాడు కరీంనగర్ లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసని మాట ఇచ్చారు. పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా సోనియా రాష్ట్రాన్ని  ఇచ్చారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండో సారి ప్రభుత్వంలో 12 వేల కోట్లని కేవలం 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారు. పదేళ్లలో 21 వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీకి కేసీఆర్ చెల్లించలేదు...రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదు. మే 6, 2022 న వరంగల్ లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. సెప్టెంబర్ 17, 20023లో తుక్కుగూడాలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ లను ప్రకటించారు. రెండు లక్షల రుణమాఫీ  చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారు. సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు 6,098 కోట్ల రూపాయలను రుణమాఫీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. రుణమాఫీకి సహకరించిన మంత్రులు, అధికారులకు రైతాంగం తరుపున ధన్యవాదాలు చెప్తున్న. నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మరుపురాని రోజు ఇది... రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు రుణమాఫీ కటాఫ్ గా పెట్టాం. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం. లక్ష లోపు రుణం ఉన్న రైతులకు ఈ రోజు రుణ విముక్తి కల్పించాం. లక్ష నుంచి లక్షన్నర రుణం ఉన్న రైతులకు  త్వరలోనే రుణ విముక్తి కలుగుతుందన్నారు.

దొంగలు చెప్పే దొంగ మాటలను నమ్మొద్దు.

అలాగే ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్. కొంత మంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహ సృష్టిస్తున్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని, రుణమాఫీకి పాస్ బుక్ నే కొలబద్ద తప్ప రేషన్ కార్డు కాదని చెప్పారు. దొంగలు చెప్పే దొంగ మాటలను నమ్మోద్దని, ప్రతి రైతు రుణమాఫీ కి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు. సమస్యలు తలెత్తితే బ్యాంక్అ ధికారులను సంప్రదించాలిని సూచించారు. బ్యాంకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ అధికారులు రైతు రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం అప్పులకు మిత్తి గా ప్రతి నెలా ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నాం. రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం.. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కి ధన్యవాదాలు తెలుపుతు తీర్మానం చేశాం. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్ గాంధీ ని ఆహ్వానించి వరంగల్ లో బహిరంగ సభ నిర్వహిస్తాం. త్వర మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు.

#telangana #cm-revant #crop-loan-waiver
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe