Janasena: పవన్‌కు రెండున్నరేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలి: హరిరామ జోగయ్య

పవన్‌ ఆహ్వానం మేరకు మంగళగిరిలోని ఆయన పార్టీ ఆఫీసుకు వెళ్లి 2 గంటల పాటు చర్చించామని కాపు నేత, మాజీ మంత్రి చేంగొడి హరిరామ జోగయ్య అన్నారు. సీట్ల సర్దుబాబు, అధికార పంపిణీ, ఉమ్మడి మేనిఫెస్టోలో పథకాలు వివిధ అంశాలపై చర్చించామని అన్నారు.

New Update
Janasena: పవన్‌కు రెండున్నరేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలి: హరిరామ జోగయ్య

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. అయితే తాజాగా కాపు నాయకుడు, మాజీ మంత్రి చేంగొడి హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. పవన్‌ ఆహ్వానం మేరకు మంగళగిరిలోని ఆయన పార్టీ ఆఫీసుకు వెళ్లి 2 గంటలకు ముఖ్య అంశాలపై చర్చించామని లేఖలో పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన 40 నుంచి 60 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిన ఆవశ్యకతను చెప్పానని తెలిపారు. జనసేనికులు పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. అధికార పంపిణి సవ్యంగా జరిగితేనే రెండున్నరేళ్ల పాటు పవన్ సీఎంగా పనిచేసే అవకాశం ఉంటుందని వారు నమ్మినప్పుడే జనసేన ఓట్లు టీడీపీకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read: వైసీపీకి షాక్.. జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం..!

లేఖలో ఏమన్నారంటే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వారిని కలిసి ముఖ్య అంశాలపై 2 గంటల సేపు చర్చించటం జరిగింది. ఈ చర్చలో ముఖ్యాంశాలైన సీట్ల సర్దుబాబు, అధికార పంపిణీ, ఉమ్మడి మేనిఫెస్టోలో చర్చించవలసియున్న వివిధ పథకాలు, పవన్ కళ్యాణ్ గారు స్వంతంగా పోటీ చేయవలసియున్న నియోజకవర్గ వివరాలు, తెలుగుదేశం, బీజేపీ కూటమితో పాటు బీజేపీని కూడా కలుపుకోవలసియున్న ఆవశ్యకతలపై సవివరంగా చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు దక్కించుకొన్న శాసనసభా సీట్లు, వివరాలు ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళటం జరిగింది. 2019 ఎన్నికల్లో 10 వేల ఓట్లు వరకు దక్కించుకొన్న అభ్యర్థుల సంఖ్య 61 కాగా, 15 వేల ఓట్లు దక్కించుకున్న అభ్యర్థుల సంఖ్య 40 వరకు ఉండటాన్ని ఆయన దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఈ ఓట్లు ప్రాతిపదికగా 2024లో జనసేన అభ్యర్థులు పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు 40 నుంచి 60 వరకు ఉండాల్సిన ఆవశ్యకతను ఆయనకు నొక్కి వక్కాణించటం నా వంతు అయితే ఈ 40 సీట్లు తగ్గకుండా సామాజికపరంగాను, ఆర్థిక పరంగాను, బలవంతులు ఉన్న నియోజకవర్గాలు జనసేన దక్కించుకోవటానికి తన వంతుగా ప్రయత్నం చేస్తాననే మాట వారి దగ్గర నేను తీసుకోగల్గినాను అని చెప్పటానికి సంతోషిస్తున్నాను.

రెండవ అంశం అధికారం పంపిణీ విషయంలో జన సైనికుల దృఢాభిప్రాయం ఏమిటో వారికి నొక్కి వక్కాణిస్తూ పవన్ కళ్యాణ్ గార్ని ముఖ్యమంత్రిగా చూడాలనే వారి ఆకాంక్ష వారి ముందు పదే పదే పెట్టటం జరిగింది. అధికార పంపిణీ సవ్యంగా జరిగినప్పుడే కనీసం 2 1/2 సంవత్సరాలైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవగలిగే అవకాశాలు ఉన్నదని వారు నమ్మినప్పుడే జనసేన ఓట్లు తెలుగుదేశానికి సవ్యంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నదని, లేనిచో 2019 ఎన్నికల తీరు 2024లో కూడా రుచి చూసే ప్రమాదం ఉన్నదని వారిని హెచ్చరించటం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ అధికార పంపిణీ సవ్యంగాను, జన సైనికుల గౌరవానికి ఎటువంటి భంగం కలుగకుండా జరగాలనే తాను కూడా ఆశిస్తున్నానని, ముందు ముందు ఈ విషయంలో స్పష్టత వస్తుందని నాకు సమాధానం యివ్వటం జరిగింది.

ఇక మూడవ అంశం అయిన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాల్సిఉన్న నియోజకవర్గ ఎంపిక వివరాలు వారి ముందు పెట్టటం జరిగింది. కొణిదెల వారి స్వంత నియోజకవర్గం, వారి కుటుంబానికి ఆస్తిపాస్తులు ఉన్న నియోజకవర్గం, అతి సులవుగా నెగ్గి రాగల నియోజకవర్గం అయిన నర్సాపురం నియోజకవర్గం ఒకటయితే, తాను పోటీ చేసి ఓడిపోయిన, పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత మేరకు భీమవరం నియోజకవర్గం రెండవది. 2009 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం అభ్యర్థి నెగ్గిన ఒకే ఒక నియోజక వర్గమైన తాడేపల్లిగూడెం మూడవది. ఈ మూడు నియోజకవర్గాల లోటుపాటులను ఆయన దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఈ మూడు నియోజకవర్గాలలో జనసేన పరిస్థితిని సర్వే చేయించి, తాను సులువుగా నెగ్గగల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవలసినదిగా ఆయనకు సూచించటం జరిగింది.

Also Read: నాలుగేళ్ల తర్వాత సొంతూరుకు రఘురామకృష్ణంరాజు…అంతకు ముందు ఏం జరిగిందంటే..

నాల్గవ అంశంగా ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చేసే ప్రతిపాదనలో భాగంగా బి.జె.పిని కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో భాగస్వామిగా చేయటం. ఈ ప్రతిపాదన త్వరలో రూపుదిద్దుకొనే పరిస్థితి ఉందని, బి.జె.పి తమ కూటమిలో చేరే అవకాశం మెండుగా ఉన్నదనే సమాధనం పవన్ కళ్యాణ్ గారు యివ్వటం జరిగింది. ఇక ఆఖరు అంశంగా తెలుగుదేశం జనసేన కూటమిల ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన ప్రతిపాదనలు ఎలా ఉండాలనేది, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారికి ఏమి అవసరాలుగా ఫీలవుతున్నారో, 4 కోట్ల మందికి చేరే అంశాలు ఏమిటో గుర్తించి ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే నిమిత్తం ప్రతిపాదనలు పంపవలసినదిగా పవన్ కళ్యాణ్ గారికి సూచించటం జరిగింది. దానికి వారు పాజిటివ్ గా స్పందించటం జరిగింది.

ఆఖరుగా కాపు కుల సంఘాలన్నీ జనసేన తెలుగుదేశం కూటమిని నెగ్గించుకోవటానికి సిద్ధంగా ఉన్నారని, అయితే రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండాలో అనే దానికి వారికి స్పష్టత ఉందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చెరి 2 1/2 సం॥రాలు ముఖ్యమంత్రి పదవి పంచుకొని పరిపాలన సాగించాలని వారు దృఢంగా కోరుకుంటున్నారని, దీనిని తీర్చే బాధ్యత మీతో పాటు చంద్రబాబు గారికి కూడ ఉందని పవన్ కళ్యాణ్ గారికి అంతిమంగా తెలియపర్చటమైనది.

Advertisment
తాజా కథనాలు