Khammam: వైరా బీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు

ఖమ్మం జిల్లా వైరా బీఆర్‌ఎస్‌లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది.

Khammam: వైరా బీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు
New Update

ఖమ్మం జిల్లా వైరా బీఆర్‌ఎస్‌లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌ లాల్‌లు వేరు వేరుగా దళితబంధు లబ్దిదారుల వివరాలు సేకరించి అధికారులకు పంపారు. ఇదంతా బాగానే ఉన్నా.. అధికారులు మాత్రం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌ లాల్‌ పంపిన జాబితాకే ప్రాధాన్యత ఇస్తుండటంతో రాములు నాయక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన తన ముఖ్య నేతలను సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు.

మరోవైపు సమావేశం నిర్వహించవద్దని పార్టీ ముఖ్య నేతలు రాములు నాయక్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తాను పంపిన దళిత బంధు లబ్దిదారుల లీస్ట్‌ను పరిశీలించడం లేదని, తనకు అహ్వానం లేకుండానే మదన్‌ లాల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పార్టీ పెద్దల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో తాను సమావేశం నిర్వహించి తీరుతానని, పార్టీలో తన ప్రాధాన్యతపై తాడో పేడో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధిగా తనకున్న అధికారాలను అభ్యర్థి ఎలా అమలు చేస్తారని అధిష్టానం ముందు ఎమ్మెల్యే వాపోయినట్లు సమాచారం.

ఎమ్మెల్యే రాములు నాయక్‌ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా వ్యాప్తంగా దళిత బంధు లబ్దిదారులను మంత్రి పువ్వాడనే ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోని లబ్దిదారులను మంత్రి ఎంపిక చేయడం ఏంటని రాములు నాయక్‌ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో వేలు పెడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ రాజు, యువ రాజులు అన్న ఆయన.. ఖమ్మంలో ఉన్న సామంత రాజు మాత్రం తనపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా పువ్వాడ అజయ్‌ ఖమ్మం నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేనా.. లేక ఖమ్మం జిల్లా మొత్తానికి ఎమ్మెల్యేనా అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ అజయ్‌ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలని చూస్తున్నాడని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు తెలియకుండా పువ్వాడ అజయ్‌ పార్టీలో కుట్రలు లేపుతున్నారని రాములు నాయక్‌ మండిపడ్డారు. కాగా ఎమ్మెల్యే రాములు నాయక్‌ భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నేతలతో చర్చించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనుచరులతో జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read: హోంగార్డ్ రవీందర్‌ను పరామర్శించిన కిషన్ రెడ్డి

#khammam #dalit-bandhu #candidate #brs #madan-lal #ramulu-naik #mml #minister #puvvada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe