/rtv/media/media_files/2025/10/22/235-2025-10-22-09-34-38.jpg)
వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది కదా.. అవును విధి మరోలా తలచింది. సంతోషంగా సాగిపోతున్న ఈ దంపతుల జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఓ మొక్కజొన్న కంకి మృత్యుపాశం అయింది. చివరకు బ్రెయిన్డెడ్ రూపంలో ఆ భార్యకు భర్తను దూరం చేసింది.
విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన రేజేటి పాపినాయుడు(27) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్లో అదే గ్రామానికి చెందిన మౌనికతో పెళ్లి అయింది. మౌనిక గర్భవతి కావడంతో అక్టోబరు17వ తేదీన ఆమె ఇంటి వద్ద భార్య సీమంతం చేశారు. కార్యక్రమం అయిపోయాక తన ఫ్రెండ్స్ ను కలిసేందుకు అచ్యుతాపురం వెళ్లాడు పాపినాయుడు. అక్కడి నుండి తిరిగి బైక్ పై వస్తుండగా.. రాజుగారి కొబ్బరితోట వద్ద రోడ్డుపై రైతులు మొక్కజొన్న కంకులు ఆరబెట్టి ఉండడంతో చూసుకోక అదుపు తప్పి పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే పాపినాయుడును విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతని బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు వెల్లడించారు. అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
పాపినాయుడు తండ్రి కూడా ఇలానే
పాపినాయుడు తండ్రి అప్పలనాయుడు కూడా ఇలానే బ్రెయిన్ డెడ్ తో 2012లో ప్రాణాలు కోల్పోయారు. అప్పలనాయుడు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడడంతో ఆయనకు బ్రెయిన్ డెడ్ అయింది. అప్పుడు తండ్రిలాగే ఇప్పుడు కొడుకు కూడా అలానే చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఊరికి తీసుకురాగా.. భార్య, కుటుంబ సభ్యులు గుండె పగిలేలా రోదించారు. గ్రామస్థులను ఈ ఘటన ఎంతగానో కలిచివేసింది.