/rtv/media/media_files/2025/05/21/PKlCHhMt0PD3Lh0PsnfW.jpg)
sarpanch mp
మధ్యప్రదేశ్లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. గుణ జిల్లాకు చెందిన ఒక మహిళా సర్పంచ్ రూ.20 లక్షల వ్యక్తిగత రుణాన్ని తీసుకుంది. తిరిగి చెల్లించడానికి ఏకంగా గ్రామ పంచాయతీనే మరోకరికి లీజుకు ఇచ్చింది. భోపాల్ నుండి 220 కిలోమీటర్ల దూరంలో గుణ శివార్లలో ఉన్న కరోడ్ పంచాయతీలో ఈ సంఘటన జరిగింది. తన అప్పును తీర్చినట్లయితే.. పంచాయతీ పనులను ఆ వ్యక్తికి అప్పగిస్తానని ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం 2022లో జరిగింది. సర్పంచ్ లక్ష్మీ బాయి స్థానిక నివాసి అయిన రణ్వీర్ సింగ్ కుష్వాహాతో నోటరీ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది.
గ్రామ పంచాయతీని మూడో వ్యక్తికి
ఆ తర్వాత ఒక నోటరీ అఫిడవిట్ ద్వారా ఆ కరోడ్ గ్రామ పంచాయతీని మూడో వ్యక్తికి అప్పగించారు. ఈ విషయం గునా జిల్లా యంత్రాగం దృష్టికి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. . మే 9న సర్పంచ్ లక్ష్మీ బాయిని అధికారికంగా ఆమె పదవి నుంచి తొలగించి విచారణకు ఆదేశించారు. సర్పంచ్ చేసిన అప్పును తీరుస్తానని హామీ ఇచ్చి పంచాయతీని స్వాధీనం చేసుకున్న రణవీర్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తిపై, ఆ తర్వాత దాన్ని మూడో వ్యక్తికి అప్పగించినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా 2022 పంచాయతీ ఎన్నికల సమయంలో తన ప్రచారానికి నిధులు సమకూర్చుకోవడానికి లక్ష్మీ బాయి ఈ రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఈ ఆరోపణలను లక్ష్మీ బాయి భర్త శంకర్ సింగ్ ఖండించారు. తాము ఎవరి నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని.. లక్ష్మీ బాయిని అన్యాయంగా పదవి నుండి తొలగించారని ఆయన అన్నారు. ఇక సర్పంచ్ లక్ష్మీ బాయి, రణవీర్ సింగ్ కుష్వాహా మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రూ. 100 స్టాంప్ పేపర్పై రాసినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. ఆ స్టాంప్ పేపర్ పరిశీలించగా వీరిద్దరి మధ్య గ్రామ పంచాయతీ పనులు నిర్వహించడానికి ఒప్పందం కుదిరినట్లుగా అర్ధం అవుతోంది. సర్పంచ్ లక్ష్మీబాయి, రణ్వీర్ సింగ్ కుష్వాను తన అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. పంచాయతీ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మంజూరు చేయబడిన వ్యయంలో 5% సర్పంచ్ లక్ష్మీబాయికి ఇవ్వబడుతుందని కూడా ఒప్పందంలో రాసుకున్నారు.