Crime: అప్పటి వరకు ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకుంటున్న బాలుడు.. ఒక్క క్షణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు! ట్రాన్స్ఫార్మర్పై పడిపోయిన షటిల్ కాక్ ని తీయడానికి వెళ్లి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వసంత్ నగర్ ఏరియాకి చెందిన 14 ఏళ్ళ ప్రేమ్ చరణ్ తన ఇంటి ప్రాంగణంలో ఫ్రెండ్స్ తో కలిసి షటిల్ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో షటిల్ కాక్ వెళ్లి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పడింది. దీంతో ప్రేమ్ చరణ్ ట్రాన్స్ఫార్మర్పై పడిన కాక్ ని బ్యాట్ తో తీసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్ కి గురయ్యాడు. ఆస్పత్రికి తరలించే లోపే అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రేమ్ చరణ్ కేపీహెచ్బీలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు. చేతికందొస్తున్న కొడుకును కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ్ చరణ్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది వర్షా కాలం కావడంతో కరెంట్ తీగలు, స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు స్తంభాలను తాకరాదు. ఎందుకంటే.. అవి నీటితో తడిసిపోయి ఉన్న కారణంగా విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తాకితే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు! ఇప్పుడు ప్రేమ్ చరణ్ విషయంలో జరిగింది ఇదేనని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అధికారులు కూడా వర్షాకాలంలో కరెంట్ తీగలు, స్తంభాల పక్కన నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తరచు ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటారు. గతంలో కూడా చాలా మంది ఇలాంటి ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. కావున వర్షాకాలంలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం! అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ట్రాన్స్ఫార్మర్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వర్షం పడుతున్న సమయంలో లేదా రోడ్లపై నీరు నిలిచి పోయినప్పుడు కరెంటు స్తంభాలకు, వాటికి ఉన్న స్టే వైర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తాకరాదు.
- అలాగే రోడ్ల మీద, నీటిలో ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటిని ముట్టుకోవద్దు. వాటిపై నుంచి వాహనాలు నడపడం వంటివి కూడా అస్సలు చేయకూడదు. ఎందుకంటే.. నీరు విద్యుత్ను చాలా వేగంగా ప్రవహింపజేస్తుంది. ఇలాంటి సమయంలో వాటిని ముట్టుకోవడం లేదా తాకడం ద్వారా విద్యుత్ ఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంది.
- వర్షాలు పడుతున్నప్పుడు గాలికి విరిగిపడిన చెట్ల కొమ్మలు లేదా ఆకులను కూడా తాకరాదు. ఒకవేళ విద్యుత్ తీగలు వేలాడుతూ ఉంటే.. వాటిని ముట్టుకోవడం ద్వారా షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
- గ్రామాల్లో లేదా పొలాల వద్ద పశువులను ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాల దగ్గర కట్టకుండా జాగ్రత్త వహించాలి.
- క్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, కరెంటు స్తంభాలు వంగిపోయినా లేదా ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఏదైనా శబ్దం వచ్చినా వెంటనే స్థానిక విద్యుత్ అధికారులకు లేదా కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయండి. వారిని సంప్రదించడానికి అత్యవసర నంబర్లను అందుబాటులో ఉంచుకోవడం మంచిది.
Also Read: War2 Pre Release Event: ఎవ్వడేం చేయలేడు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ స్పీచ్ వీడియో!