Andhra Pradesh: జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు.. అరెస్ట్ తప్పదా?

వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలతో బయటపెట్టింది. 2019 నుంచి 2024 వరకు అవినీతి, దోడిపిడి పాల్పడిన మాజీ సీఎం అరెస్టు అయ్యే అవశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతపత్రాలపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Andhra Pradesh: జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు.. అరెస్ట్ తప్పదా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్‌ రంగంలో సంక్షోభం, అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారం.. ఇలా మొత్తం నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేశారు. వైసీపీ హయాంలో వీటన్నంటిపై అక్రమాలు, దోపిడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. అసలు శ్వేతపత్రాల్లో ఎలాంటి విషయాలు చంద్రబాబు వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం.

పోలవరంపై శ్వేతపత్రం
రాష్ట్ర విభజన జరిగిన నష్టం కంటే వైసీపీ హయాంలో జరిగిన నష్టమే ఎక్కువని ఈ శ్వేతపత్రంలో వివరించారు. పోలవరానికి సంబంధించి రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.11,762 కోట్లు ఖర్చు పెట్టింది. అందులో కేంద్రం వాటా రూ.6,764.16 కోట్లు. మిగతా నిధుల చెల్లింపుల్లో ఆలస్యం చేసింది. చివరికి మొత్తంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కోసం రూ.8,382.11 కోట్లు వచ్చాయి. కానీ ఇందులో వైసీపీ సర్కార్‌ కేవలం రూ.4,996.53 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేసి.. మిగిలిన నిధుల్లో రూ.3,385.58 కోట్లను వేరే అవసరాలకు దారి మళ్లించారు. దీనివల్లే ప్రాజెక్టు పనుల్లో నిధులకు కొరత ఏర్పడింది.

2024 మే 31 నాటికి మొత్తం రూ.2,697 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం పనులపై కూడా ప్రభావం చూపింది. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏజెన్సీలన్నీ కూడా పనులు నిలిపివేసినట్లు శ్వేతపత్రం వివరించింది. అలాగే ఎగువ కాపర్‌ డ్యామ్‌లో గ్యాప్‌లను పూడ్చకపోవడం వల్ల 2020లో వరదల వల్ల దిగువ ఉన్న డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఇప్పుడు కొత్త వాల్ నిర్మాణానికి రూ.970 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో వివరించారు.

అమరావతిపై శ్వేతపత్రం
మాజీ సీఎం జగన్‌ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అమరావతిలో పనులు నిలిపివేశారు. దీంతో రూ.1,269 కోట్ల బకాయిలు మిగిలాయి. 1,917 ఎకరాల భూకసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 2,903 మంది రైతులకు యాన్యుటీని రద్దు చేశారు. 4,442 మంది రైతులకు సంక్షేమ పింఛన్‌లను రద్దు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వంపై రైతులు 1630 రోజుల వరకు ఆందోళనలు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన 300 మిలియన్ డాలర్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1000 కోట్లను అడ్డుకుంది.

2014-19లో తెలుగుదేశం పార్టీ (TDP) ప్రభుత్వం ఆవిష్కరించిన అమరావతి ప్రణాళికల ప్రకారం.. ప్రాజెక్ట్ వ్యయం రూ.51,687 కోట్లుగా నిర్ణయించబడింది. ఇందులో సిటీ-లెవల్ రోడ్స్ యుటిలిటీస్, విలేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో కూడిన టైర్-1 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.19,769 కోట్లు, ఇక టైర్-II మౌలిక సదుపాయాల కోసం రూ.17,910 కోట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌కు రూ.14,008 కోట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత రూ.41,170 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ.4,318 కోట్లు చెల్లించగా, నేటికి రూ.1,268 కోట్లు చెల్లించాల్సి ఉంది. అమరావతిని సకాలంలో నిర్మించడాన్ని 'కోల్పోయిన అవకాశంగా' సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో వివరించారు.

విద్యుత్ రంగంపై శ్వేతపత్రం
2019 నుంచి 2024 వరకు ప్రజలపై విపరీతంగా విద్యుత్‌ భారం పడింది. వినియోగదారులపై వైసీపీ ప్రభుత్వం రూ.32,166 కోట్ల భారం మోపింది. విద్యుత్‌ సంస్థల రుణాలు రూ.49,596 కోట్లకు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ రంగానికి రూ.47,741 కోట్లు నష్టం జరిగింది. ట్రూఅప్ చార్జీల పేరుతో అదనపు భారం మోపారు. గృహ వినియోగదారులపై 45 శాతం చార్జీలు పెంచేశారు. ఇలా పెంచడం వల్ల 1.53 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 50 యూనిట్లు వాడిన పేదల చార్జీలు కూడా 100 శాతం పెంచినట్లు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై శ్వేతపత్రం

2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాల జరిగాయి. ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోచుకున్నారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారు. అనర్హులైన వారికి భూ కేటాయింపు చేశారు. మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన కంపెనీలకు కోట్లు విలువ చేసే భూములు కట్టబెట్టారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తిని ఫేక్ డాక్యుమెంట్లతో దోచుకున్నారు. తిరుపతిలో మఠం భూములకు సంబంధించి 70 ఎకరాల భూమిని 22 ఏలో పెట్టి దోచేశారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా కాజేశారు. ఇళ్ల పట్టాల ద్వారా రూ.3 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీల నుంచి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారు. నివాస యోగ్యం కానీ చోట్ల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇసుక దందాలో రూ 9,750 కోట్లు దోపిడీ చేశారని చంద్రబాబు ఈ శ్వేతపత్రంలో తెలిపారు.

ఇదిలాఉండగా.. కూటమి ప్రభుత్వం ఈ నాలుగు శ్వేతపత్రాల్లో జగన్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టింది. అలాగే వీటిలో జరిగిన అక్రమాలపై.. మాజీ సీఎం జగన్‌తో పాటు ఇతర నేతలపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే సీబీఐ కేసులో అరెస్టయిన జగన్‌.. మరోసారి అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు