Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో అల్లుఅర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది కూడా CM రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని ‘పుష్ప2’లోని డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇది సార్ మా అన్న బ్రాండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

New Update
gaddar film awards allu arjun mass Dialogue in front of CM Revanth Reddy

gaddar film awards allu arjun mass Dialogue in front of CM Revanth Reddy

తగ్గేదేలే.. ఈ డైలాగ్ వినిపిస్తే ముందుగా గుర్తుచ్చేది అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమా నుంచి వచ్చిన ఈ డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. సినీ, రాజకీయ, క్రీడలకు సంబంధించిన ప్రముఖులు సైతం ‘తగ్గేదే లే’ డైలాగ్‌ చెప్పడం చూస్తునే ఉన్నాం. తాజాగా బన్నీ మరోసారి ఓ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఈ డైలాగ్ చెప్పడం సంచలనంగా మారింది. 

gaddar film awards

తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రోగ్రాం నిన్న (శనివారం) ఎంతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగా అవార్డులు గెలుచుకున్న సెలబ్రెటీలకు షీల్డ్‌, నగదుతో బహుమతి అందజేశారు. 


 ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. పుష్ప 2 సినిమాలో ఆయన తన యాక్టింగ్‌కు గానూ ఈ అవార్డు వరించింది. ఈ అవార్డును బన్నీ స్వయంగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ స్టేజిపైనే పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.  

ఈ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్‌లో బన్నీ ‘పుష్ప2’లోని ఒక డైలాగ్ చెప్పాడు. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా కొండ గంగమ్మ తల్లి జాతరలో యాట తలను నరికినట్లు ఒక్కొక్కణ్ని రప్పా రప్పా నరుకుతా. పుష్పా పుష్ప రాజ్.. అస్సలు తగ్గేదేలే అంటూ డైలాగ్ చెప్పాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 

దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతో మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అల్లు అర్జున్ అంటూ కామెంట్ల బాక్స్ నింపేస్తున్నారు. 

గతంలో పుష్ప2 మూవీ ప్రీమియర్ టైంలో తొక్కిసలాట జరగడం.. అందులో ఒక మహిళ మృతి చెందడంతో బన్నీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇంత ఘోరం జరిగితే.. బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదని.. అల్లు అర్జున్‌కు కాళ్లు పోయాయా?.. కన్నుపోయిందా? అతడికి ఏమైంది?.. ఎందుకు అతడిని అంతమంది పరామర్శిస్తున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 

కానీ ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అందులోనూ రేవంత్ రెడ్డి పక్కన ఉండగానే అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ డైలాగ్ చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో ఇది సార్ మా అన్న బ్రాండ్ అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు