Chandrasekhar: పార్టీ కోసం కష్టపడే వారికి గౌరవం ఉండదు

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో సినియర్లు పేరుకే ఉన్నారని వారు ఏంచేయలేరన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కదన్నారు.

New Update
Chandrasekhar: పార్టీ కోసం కష్టపడే వారికి గౌరవం ఉండదు

తెలంగాణలో బీజేపీ పతనం అవ్వబోతుందా..? బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ పెరిగిందా.? పార్టీ అధ్యక్షుడి మార్పు వల్ల బీజేపీకి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చా..? చంద్రశేఖర్‌ బీజేపీకి రాజీనామా చేయడం వెనుక రహాస్యం ఏంటి.. పార్టీలో పేరుకే సీనియర్లు ఉన్నారని, వారు ఏం చేయలేకపోతున్నారని అనడం వెనుక అంతర్యమేంటి..? రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఖాళీ అవ్వక తప్పదా..

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో పేరుకే సీనియర్‌ నేతలు ఉన్నారని, వారు పార్టీకోసం ఏం చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడే వాళ్లకు బీజేపీలో గౌవరం దక్కదన్న ఆయన.. పార్టీ కోసం కష్టపడ్డ బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తీసేయడమే అందుకు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై కోడిగుడ్ల దాడి జరిగినా పార్టీ కోసం బరించారన్నారు. వర్షాలు పడ్డ సమయంలో రైతుల వద్దకు వెళ్లిన బండి సంజయ్‌పై రైతుల ముసుగులో బీఆర్ఎస్‌ శ్రేణులు అనేక సార్లు దాడి చేసినా ధైర్యంగా ముందుకు వెళ్లారని వెల్లడించారు. పార్టీ కోసం ఆయన అనేక ఇబ్బందులను అనుభవించారన్నారు.

బండి సంజయ్ వానలు పడుతున్నా తన పాదయాత్రను ఆపలేదని చంద్రశేఖర్‌ అన్నారు. మూడు రోజులు పాదయాత్ర చేసి ఆస్పత్రి పాలైన ఈటల రాజేందర్‌ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడన్నారు. కిషన్‌ రెడ్డి గంట పాదయాత్ర చేస్తే రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ వల్ల తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రశేఖర్.. తెలంగాణ బీజేపీపై నరేంద్ర మోడీ అమిత్‌ షా తీసుకుంటున్న నిర్ణయాలు తనకు నచ్చలేదన్నారు.

బీజేపీ పెద్దలు రాష్ట్రానికి వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నారే తప్ప.. వాటిని అరికట్టలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కుంభకోణాలు బయటపెడుతామంటున్నారు కానీ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకు చూడటం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ పెద్దలు మాటలకే తప్ప చేతలకు లేరని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న పోరాటాన్ని సైతం బీజేపీ నేతలు గమనించలేకపోతున్నారన్నారు. అధికార పార్టీపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పోరాటం గొప్పదన్నారు. ఈ విధంగా పోరాటం చేస్తేనే పార్టీని అధికారంలోకి వస్తుందన్నారు

Advertisment
తాజా కథనాలు