KTR: లేకుంటే నష్టం జరుగుతుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉండాలన్నారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, ఇదే విషయం ప్రజలకు చెప్పాలని ఈరోజు జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కోరారు.

New Update
KTR: లేకుంటే నష్టం జరుగుతుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Ex-Minister KTR: మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) తగ్గరపడుతున్న తరుణంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) జరిగిన మెదక్ (Medak) పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై (Congress Party) విమర్శల దాడి చేశారు.

ఇది కూడా చదవండి: 22న సెలవు ఇవ్వండి.. రేవంత్ సర్కార్ కు బండి సంజయ్ రిక్వెస్ట్!

అందుకే స్వేద పత్రం..

గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే స్వేద పత్రం విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచామని.. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించినట్లు పేర్కొన్నారు.

మనందరి బాధ్యత...

కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని.. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారని పేర్కొన్నారు కేటీఆర్. దీన్ని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందని సమావేశానికి వచ్చిన నేతలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నరని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వర రావు గారు రుణాలు వసూలు చేయాలి అని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడని పేర్కొన్నారు.

నిరుద్యోగ భృతి సంగతేంటీ?...

ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి గారు భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారని కేటీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారని.. కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైందని తెలిపారు. నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని.. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టం అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.

అసలు రంగు బయట పడుతున్నాయి..

ప్రధాని మోడీ, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్ లో ఒప్పందం చేసుకున్నారని చురకలు అంటించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతున్నాయని అన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని... కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడని ప్రశ్నను లేవనెత్తారు.

ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా..

కేసీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం అని అన్నారు కేటీఆర్. ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతోందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని.. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలని అన్నారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, ఇదే విషయం ప్రజలకు చెప్పాలని కోరారు. నిరాశ వీడి.. బయటికి రావాలని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు..

ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సునీతా లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు