BJP Modi Politics : గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం 

ఈమధ్య ప్రధాని మోడీ కాంగ్రెస్ లోని గాంధీయేతర నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న కూడా ప్రకటించారు. అసలు మోడీ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ స్వయంకృతాపరాధాన్ని ప్రధాని ఎలా అనుకూలంగా మార్చుకుంటున్నారు.. ఈ స్పెషల్ స్టోరీ చదవండి 

BJP Modi Politics : గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం 
New Update

BJP Modi Politics : భారతదేశ రాజకీయాలు(Indian Politics) మునుపు ఉన్నట్టుగా కచ్చితంగా లేవు. బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాకా.. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రాభవం క్షీణిస్తూ వస్తోంది తప్ప.. ఏ మాత్రం సై అంటే సై అనేలా బీజేపీతో ఢీ కొనేలా లేదు. గత పార్లమెంట్ ఎన్నికలకూ.. ఇప్పటి ఎన్నికలకూ మధ్య కాంగ్రెస్ పార్టీ మరింతగా కిందికి జారిపోయింది. ఎప్పుడన్నా ఒకటీ ఆరా కర్ణాటక, తెలంగాణ  లాంటి విజయాలు ఆ పార్టీకి దక్కినా.. అవి స్థానిక పరిస్థితుల వల్ల తప్ప కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం వలన అని చెప్పే పరిస్థితి లేదు. ఇందుకు కారణం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గాంధీ అనే ఇరుసు ఆధారంగా తిరిగే చక్రంగా మారిపోయింది. ఎంతటి ఉద్ధండులు ఆ పార్టీలోకి వచ్చినా వారంతా అదే ఇరుసు ఆధారంగా తిరగాల్సిందే. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. భారతరత్న పీవీ నర్సింహారావు(PV Narasimha Rao) ఉదంతమే చాలా స్పష్టంగా గాంధీ కుటుంబ ప్రాబల్యం ఎలాంటిదో చెబుతుంది. తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు అనే ఒకే ఒక్క కారణంతో.. దేశం..పార్టీ  క్లిష్ట పరిస్థితిలో ప్రధానిగా వ్యవహారాలను తన అనుభవంతో చక్కదిద్దిన పీవీ నర్సింహారావు చనిపోతే.. అయన మృత దేహాన్ని ప్రజల సందర్శన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. ఇలా పీవీ ఒక్కరే కాదు.. గాంధీ కుటుంబం బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా చరిత్రలో చివరికి కాంగ్రెస్ పేరు చెప్పుకునే పరిస్థితి లేకుండానే మిగిలిపోయారు. సర్దార్ పటేల్ నుండి కామరాజ్, నిజలింగప్ప, నీలం సంజీవ్ రెడ్డి, ప్రణబ్ ముఖర్జీ, విపి సింగ్, అర్జున్ సింగ్ అలాగే పీవీ నరసింహారావు వీరంతా పార్టీకి సేవలు చేశారు తప్ప.. చివరికి వారికి పార్టీలో ఏమంత గౌరవం మిగలలేదు. గాంధీలు తప్పితే ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కుగా ఉండకూడదనే(BJP Modi Politics) ఇప్పటి గాంధీల తత్వం. అందుకే పార్టీ నీరుగారిపోతున్నా.. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా గట్టి బాధ్యతలు ఉన్నా.. గాలివానలో పడవలా కొట్టుకుంటోంది. 

వారి బలహీనతే ఆయుధం..
ఇదిగో సరిగ్గా ఈ బలహీనతే.. బీజేపీ బలం అయింది. దానిని అందిపుచ్చుకున్న ప్రధాని మోడీ(BJP Modi Politics).. గాంధీయేతర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ కు దూరంగా జరిపే వ్యూహం పన్నుతున్నారని అనిపిస్తుంది. మోడీ(PM Modi) ఇటీవల కాలంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీలోని గాంధీయేతర నాయకులపై పొగడ్తల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. సోనియా గాంధీ.. కాంగ్రెస్ పక్కన పెట్టేసి.. అవమానించిన పీవీ నర్సింహారావుకు ఏకంగా భారతరత్న ప్రకటించి కాంగ్రెస్ లో పెద్ద కుదుపు తీసుకువచ్చారు. ఇక్కడ మోడీ రెండు వ్యూహాలు కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర నాయకుల్లో కాంగ్రెస్ గాంధీ నాయకుల పట్ల విధేయత తగ్గేలా చేయడం.. రెండోది తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అనుగుణంగా ప్రజల్ని సిద్ధం చేయడం. ఈ వ్యూహంలో పీవీ లానే చాలామంది గాంధీయేతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇటీవల ఈ లోక్‌సభ చివరి సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్‌ను తూర్పార పట్టారు. అయితే అదే రేంజిలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రశంశాల్లో ముంచేసాహారు. అలాగే గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సందర్భంగా కూడా ఆయన ఇదే విధమైన భావోద్వేగాన్ని ప్రదర్శించారు. 

వంశపారంపర్య ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ నెహ్రూ-ఇందిరా కుటుంబం నుండి బయటకు రాలేకపోయింది. అయితే, ఇప్పుడు ప్రధాని మోడీ(BJP Modi Politics) కాంగ్రెస్ ను పూర్తిగా ఈ కుటుంబానికే పరిమితం చేసే పని చాపకిందనీరులా చేసేస్తున్నారని చెప్పవచ్చు. గాంధీ  కుటుంబానికి బయటి నుంచి వచ్చిన కాంగ్రెసోళ్లను ఆయన సన్మానిస్తున్న తీరు, అప్పుడప్పుడూ విపరీతంగా పొగిడే తీరు చూస్తుంటే ప్రధాని దృష్టిలో కాంగ్రెస్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రతిపక్షంలోనే కూచునేలా.. అదీ గాంధీల నేతృత్వంలో గాంధీల కాంగ్రెస్ లా మార్చేయడమే బీజేపీ-మోడీ వ్యూహం అని స్పష్టంగా కనిపిస్తోంది. 

గాంధీల స్వయంకృతాపరాధం..
అవును కాంగ్రెస్ పార్టీ ఈ స్థితికి కారణం ఆ పార్టీ నాయకులు గాంధీల స్వయంకృతాపరాధంగానే చెప్పొచ్చు. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఇంకో నాయకుడి చేతిలో పెట్టడం అంటేనే గాంధీ కుటుంబానికి నచ్చదు. కాంగ్రెస్ అధ్యక్షులుగా బయటవారిని ఎప్పుడైనా ఉంచినా.. వారు తమ కనుసన్నల్లోనే మెలిగేలా చూసుకుంటారు సోనియా గాంధీ. నిజానికి వారసత్వం అనేది తప్పుకాదు. టాలెంట్ ఉన్న నాయకుడు తన తండ్రి తరువాత పార్టీ పగ్గాలు అందుకుని నడిపించే సత్తా చూపిస్తే అది సరైనదే. కానీ, కాంగ్రెస్ లో అలా కాదు. అధ్యక్షుడు ఎవరైనా.. నిర్ణయాలు గాంధీ కుటుంబమే తీసుకుంటుంది. పోనీ రాహుల్ గాంధీ పార్టీని ఉరుకులు పెట్టించే సత్తా ఉన్నా నాయకుడిగా ఎదిగారా అంటే దానికి స్పష్టంగా అవును అని చెప్పలేం. ఎందుకంటే, ఆయన అప్పుడే హిదూత్వ విధానం అని తూర్పార పడతారు.. మళ్ళీ వెంటనే హిదూత్వ విధానం పట్ల అనుకూలంగా మాట్లాడతారు. రాహుల్ ఇప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ లో అంతా బహిరంగంగానే చెప్పుకుంటారు. ఈ పరిస్థితిలో మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ, అది పేరుకే.. నిర్ణయాత్మక శక్తి మాత్రం గాంధీలే. ఇది ఓపెన్ సీక్రెట్. 

Also Read :  బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..!

మరోవైపు కాంగ్రెస్‌ను నిలబెట్టే కొట్టే శక్తి రాహుల్‌కి గానీ, సోనియాకు గానీ, ప్రియాంకకు గానీ లేదన్న రీతిలో ప్రధాని మోడీ(BJP Modi Politics) కాంగ్రెస్‌ను చుట్టుముట్టారు. పార్టీలోని ఏ నాయకుడిపైనా ఆ కుటుంబానికి నమ్మకం లేదు కాబట్టి ఎవరికైనా పూర్తి కమాండ్ ఇవ్వడానికి భయపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ కష్టపడాల్సిన పనిలేదు. నిజానికి కాంగ్రెస్ లోని  పెద్ద నాయకులు కూడా 2024లో బీజేపీ మాత్రమే అధికారంలోకి వస్తుందని రహస్యంగా ఊహిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ తరపున నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు వచ్చే ధైర్యం చేయరు. 

మోడీ హిట్ ఫార్ములా..
ఇన్ని ఇబ్బందుల మధ్యలో కాంగ్రెస్ ఇండియా అంటూ కూటమి రాజకీయాలను తలకెత్తుకుంది. అది పురిట్లోనే సంధి కొట్టినట్టుగా మారిపోయిన పరిస్థితి కనపడుతోంది. ప్రత్యర్థి బలంతో తలపడే వారిని గెలిచే ప్రయత్నం చేయవచ్చు కానీ.. బలహీనతను ఆయుధంగా చేసుకున్నవారిని గెలవాలంటే.. ముందు మన బలహీనతను గెలవాలి. ఆ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో లేదు. అందుకే కాంగ్రెస్‌ను రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలకే పరిమితం చేయాలనే ప్రధాని(BJP Modi Politics) ఫార్ములా హిట్‌గా మారింది. కుటుంబానికే పరిమితమైన పార్టీ విస్తరించదు. ఈ కుటుంబం దాని స్వంత శక్తివంతమైన నాయకులను విస్మరించింది. తమ ప్రాభవాన్ని విస్తరించుకునే అవకాశం వారికి ఇవ్వలేదు. ఒకప్పుడు, ఇందిరా గాంధీ తన కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించారు, అందుకే పార్టీ అప్పటి వరకు బలంగా ఉంది. రాజీవ్ గాంధీ కాలం నుంచే కాంగ్రెస్ పతనం మొదలైంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌లో నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేరు. ఫలితం ఇదిగో ఇలా మన ముందుంది. కాంగ్రెస్ రాజకీయ పార్టీగా మనుగడ సాగించాలంటే ఈ కుటుంబ ఫార్ములా నుంచి బయటకు రావాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది.  కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏ కుటుంబం అధికారాన్ని అయినా సవాలు చేయవచ్చు. 

ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం హానికరం..
పొగతాగడం హానికరం అని మనం ఎలా చెప్పుకుంటామో.. రాజకీయాల్లో కూడా ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అంతకంటే ఎక్కువ హానికరం అని చెప్పొచ్చు. ఒక పొగతాగేవాడి చుట్టూ ఉండే వారిని కూడా వ్యాధులు ముంచేసినట్టు.. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ కష్టాలు ముప్పేటగా చేరి ముంచేస్తాయి. అది దేశానికి.. దేశ ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు.. బీజేపీ మోడీని ఓడించాలంటే.. ముందు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడి వారితో మమేకం కావాలి. లేదంటే.. వారి ఓటమి కాంగ్రెస్ పార్టీనే కాదు దేశ ప్రజలను కూడా కష్టాల పాలు చేస్తుంది. కానీ, పొగతాగడం హానికరం అని తెలిసినా బలహీనత వదులుకోలేని ప్రజల్లానే.. కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఎప్పటికి మంచి రోజులు వస్తాయో కాలమే చెప్పాలి. 

- KVD వర్మ

Watch this interesting Video:

#congress #pm-modi #politics #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి