/rtv/media/media_files/2025/10/30/erri-swamy-2025-10-30-13-01-36.jpg)
ERRI SWAMY
ERRI SWAMY : కర్నూలు బస్సు ప్రమాదం జరిగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోబస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి RTVతో సంచలన విషయాలు వెల్లడించాడు. ప్రమాదం విషయంలో తానేంతో బాధపడుతున్నానన్న స్వామి ప్రమాదంలో తన తప్పేం లేదని స్పష్టం చేశాడు.-- తప్పు చేసి ఉంటే పారిపోకుండా ఇక్కడే ఎందుకు ఉంటానన్న ఎర్రిస్వామి బస్సు ప్రమాదానికి కారణం శివశంకరే అని తేల్చి చెప్పాడు.
ఆ రోజు జరిగిన విషయాలను ఆర్టీవీతో చెప్తూ ''నేను హైదరాబాద్ జీహెచ్ఎంసీలో చెత్త సేకరించే ఓ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్గా పని చేస్తున్నా. నాతో పాటు కల్యాణ్ అనే మిత్రుడు కూడా పని చేస్తాడు. కల్యాణ్ పెళ్లికి వెళ్లాలని గరువారం(23వ తేదీ) మధ్యాహ్నం గచ్చిబౌలి నుంచి కారులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పెద్దటేకూరులో మా ఇంటికి వచ్చా. అమ్మ ఇంట్లో లేకపోవడంతో శివశంకర్కు కాల్ చేశా. శివశంకర్ నాకు మూడేళ్లుగా స్నేహితుడు. వెంటనే ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా మద్యం తాగుదామంటే శివశంకర్ పల్సర్ బైక్పై రాత్రి 7 గంటల సమయంలో పెద్దటేకూరులోని శ్రీ రేణుక ఎల్లమ్మ వైన్షాప్కు వెళ్లి రెండు క్వార్టర్లు మద్యం కొని ఇద్దరం అక్కడే తాగాం. ఆ తర్వాత మరో రెండు క్వార్టర్లు కొని తాగాం. రాత్రి 9:15 గంటలకు ఇంటికి వెళ్లి పడుకున్నాం. రాత్రి 10:30 గంటల సమయంలో అమ్మకు ఫోన్ చేసి.. రాంపల్లిలో ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను. పెళ్లి చూసుకుని రేపు రాత్రికి వస్తానని చెప్పాను.
అర్ధరాత్రి 2:15 గంటల సమయంలో శివశంకర్ నిద్రలేపాడు. డోన్లో వదిలేసి వస్తానని చెబితే.. వద్దువద్దు కర్నూలు బస్టాండ్లో వదిలేయ్.. అక్కడి నుంచి బస్సుకు వెళ్తానని ఎంతచెప్పినా వినలేదు. రాత్రి ఎక్కువగా మద్యం తాగడంతో మైకంలోనే ఉన్నాడు. ఈ టైంలో వద్దు.. బైక్కు డూంలైట్ కూడా లేదు అంటే వినలేదు. 'నాకు బైక్ నడపడం అలవాటే.. డోన్లో దింపేస్తాను రా!' అని బలవంతం చేస్తే అతని పల్సర్ బైక్పై బయలుదేరాం. బైక్కు హెడ్లైట్ కూడా లేదు. ఇండికేటర్ వెలుగులోనే బయలుదేరాం. పది నిమిషాల్లో చిన్నటేకూరు సమీపంలో ఓ బంక్లో రూ.300 పెట్రోల్ పోయించుకున్నాం. ఆ తర్వాత నేషనల్ హైవేపైకి వచ్చాం.. వర్షం మొదలైంది. ఆ వర్షంలోనే ఐదారు కిలోమీటర్లు వెళ్లామో లేదో..బైక్ నడుపుతున్న శివశంకర్ డివైడర్కు ఢీకొట్టగానే నేను డివైడర్ మధ్యలో గడ్డిలో పడిపోయాను. బైక్, శివశంకర్ రోడ్డు మధ్యలో పడిపోయాడు. నేను లేచివెళ్లి పలకరిస్తే ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్నాడు. తల నుంచి రక్తం కారుతోంది. బలవంతంగా లాక్కుంటూ వెళ్లి రోడ్డు పక్కకు తీసుకొచ్చాను.-- నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి. 3 బస్సులు బైక్ను క్రాస్ చేసి వెళ్లాయి.
అవి వెళ్లిన కొన్ని క్షణాలకే పసుపు రంగులో ఉన్న బస్సు(వి.కావేరి) అతివేగంగా బెంగళూరు వైపు వెళ్తూ రోడ్డు మధ్యలో పడివున్న మా పల్సర్ బైక్ను ఢీకొని దూసుకుంటూ వెళ్లడం నా కళ్లారా చూశా. బస్సు ముందు చక్రాల కింద బైక్ ఇరుక్కుని అలాగే కొంత దూరం వెళ్లింది. ఇంతలో బస్సు ముందు భాగంలో మంటలు వచ్చాయి. డ్రైవర్ బస్సు ఆపేసి ఆ మంటలను ఆర్పుతున్నట్లు గమనించాను. భయంతో బస్సులో ఉన్న వారిని కాపాడలేకపోయాను. తర్వాత శివశంకర్ ఫోన్ తీసుకుని పారిపోయాను. అదేరోజు సాయంత్రం పోలీసులు నన్ను అరెస్టు చేశారు -అని ఎర్రిస్వామి వెల్లడించాడు. జరిగిన విషయం పోలీసులకు చెప్పాను. నా వల్ల ప్రమాదం జరగలేదు. నా టైం బ్యాడ్ అని ఎర్రిస్వామి జరిగిన ఘటనను వివరించాడు.
Follow Us