సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం విజయవాడ జైలుకు వెళ్లి పీఎస్ఆర్ ను కలిసి వచ్చానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆంజనేయులుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదు ఇచ్చిందన్నారు. ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి కొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పీఎస్ఆర్ తనతో చెప్పారన్నారు.
పోసాని మీద పెట్టిన సెక్షన్ల గురించి మాట్లాడిన ఉండవల్లి #PosaniKrishnaMurali చేసిన తప్పు ఏంటయ్యా అంటే మీడియా ముందుకు వచ్చి #chandrababu ను తిట్టడం దానికి వేరే సెక్షన్లు ఉన్నాయి, కానీ వాళ్ళు పెట్టింది దేశ ద్రోహం లాంటి సెక్షన్లు - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ pic.twitter.com/DrIWLOcsDh
— greatandhra (@greatandhranews) May 5, 2025
కక్షసాధించి వద్దు..
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. గతంలో జగన్ ఇదే తప్పు చేశారన్నారు. పోసాని కృష్ణ మురళి పై సంబంధం లేకుండా దేశద్రోహం సెక్షన్ కింద కేసు పెట్టారని ఫైర్ అయ్యారు. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టంపై తనది కంఠశోషగా మారిందన్నారు. విభజన అన్యాయం అంటూ సుప్రీంకోర్టులో నేను కేసు వేసి నేటికి 11 ఏళ్లు పూర్తయిందన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పటికైనా కేంద్రంతో సుప్రీంకోర్టులో కౌంటర్ వేయించాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారన్నారు. ఈ విషయంలో అందరూ కేంద్రానికి అండగా నిలబడాలన్నారు. పెహల్ గాం దాడి ఘటన సాకుగా చూపి భారత్లో ముస్లింలను టార్గెట్ చేయడం సరికాదన్నారు.
(undavalli-arun-kumar | telugu-news | telugu breaking news)