/rtv/media/media_files/2025/08/19/viveka-murder-case-2025-08-19-16-16-20.jpg)
Viveka murder case
Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం లోపు దర్యాప్తును ముగించాలని గడువు విధించినందు వల్లే హత్య కేసులో దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీతతోపాటు, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం వివరించింది.
వివేకా హత్య కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందని లూథ్రా అభిప్రాయపడ్డారు. నిందితులు సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని లూథ్రా కోర్టుకు వెల్లడించారు. సునీత దంపతులతోపాటు రాంసింగ్పైనా కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని వివరించారు. దీంతో ఆ కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. ‘‘నిందితులను కాలపరిమితి లేకుండా జైలులో ఉంచడం మంచిది కాదన్నారు. కానీ.. హత్య తీరు చూస్తే నిందితులకు 2, 5 ఏళ్లు చాలా తక్కువే అనిపిస్తోందన్నారు. ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైంది. వివేకాకు ముందు గుండెపోటు వచ్చిందని.. తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారన్నారు. హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. అన్ని వివరాలు దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయి’’ అని ఎస్వీ రాజు కోర్టుకు వివరించారు.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదనలు వినిపించారు..‘‘నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఫొటోలతో సహా ఉన్నాయి. జైలుకెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయి’’ అని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సీబీఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు.అవినాష్ రెడ్డే వివేకా హత్యలో మాస్టర్ మైండ్ అని ధర్మాసనానికి తెలిపారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటికి రావాల్సి ఉందని సిద్ధార్థ లూథ్రా తన వాదనలు ముగించారు.
ఈ మేరకు తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని ధర్మాసనం సీబీఐని కోరింది. దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని పేర్కొంది. ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న విషయాన్నీ చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా కూతురు, అల్లుడు సునీతా రెడ్డి, నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్సింగ్పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వివేకా కూతురు, అల్లుడిపై కేసు పెట్టారని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 9(సెప్టెంబర్ 9)కి వాయిదా వేసింది.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ