Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయం!?

హీరో నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయంగా కనిపిస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించారని 'జనం కోసం' అనే సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో రేవంత్ సర్కార్ దీనిపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది.

New Update
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత ఖాయం!?

Akkineni Nagarjuna: హైదరాబాద్‌లో గత ప్రభుత్వ మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన సంగతే. ఇదిలా ఉంటే కొందరు సెలబ్రెటీలు అక్రమంగా నిర్మించిన కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అందులో అక్కినేని నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలోనే దీనిపై చర్యలకు ఉపక్రమించారని.. కానీ మధ్యలో ఆపేశారని.. ఇప్పుడు దీని మీద దృష్టిసారించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇది అక్రమ కట్టడం అనడానికి రుజువులు కూడా చూపిస్తోంది జనం కోసం సంస్థ. నాగార్జున గతంలో ప్రభుత్వ అధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారా కన్వెన్షన్ సెంటర్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పెద్ద సెలబ్రెటీకి చెందిన కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేంత సాహసం చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న.

చెరువును కబ్జా చేసి నిర్మాణాలు..
గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా.. అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు పలువురు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా విస్తరించి ఉన్న తమ్మిడి చెరువు కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం ఆక్రమణకు గురైంది. శిల్పారామం, శిల్ప కళావేదికలతో పాటు అనేకం ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసినా.. వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై ‘దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును చెరబట్టి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. దీనిపై మా ‘జనం కోసం’ అనేక ఫిర్యాదులు చేసింది. లోకాయుక్త కంప్లైంట్ నెంబర్ 2815/2012/B1గా స్వీకరించి అధికారులకు అనేకమార్లు హెచ్చరికలు జారీ చేయగా.. 14-07-2014 ప్రాంతంలో చర్యలకు ఉపక్రమించినట్లు డ్రామాలాడి మిన్నకుండి పోయారు. ప్రభుత్వ పెద్దల ‘మిలాఖత్’ ఈ చెరువుపై చర్యలు తీసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. ‘జనం కోసం’ సంస్థ సర్వే నెంబర్ 36, 37, 38/పి. 11/2, 11/36, 68/పి, 41/పి లకు చెందిన 29 ఎకరాల 24 గుంటల చెరువు, ప్రభుత్వ భూమి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లపై ఉన్న కబ్జాలను తొలగించి.. ‘తమ్మిడి చెరువు’ను పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేసింది’ అని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదును అందజేశారు.

నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు..?
టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌పై చర్యలు తప్పవా? అంటే అవుననే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ అంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఆయన కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని తెలిపారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దీంతో 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్ళలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విర్తీర్ణం.. ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా ఝుళిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్‌ కన్వెన్షన్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలున్నాయి.

Also Read : నాణ్యతను అస్సలు పట్టించుకోలేదు..కాళేశ్వరంపై బయటపడుతున్న నిజాలు

Advertisment
తాజా కథనాలు