/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/yarlagadda-tdp-jpg.webp)
Yarlagadda venkat rao to join TDP? : గన్నవరం రాజకీయం వేడెక్కింది. అక్కడ అధికార వైసీపీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని వంశీ టికెట్ లొల్లి ముదురుతోంది. దీంతో యార్లగడ్డ వెంకట్రావు(yarlagadda venkat rao) సైలెంట్గా సైకిల్ ఎక్కెందుకు రెడీ ఐనట్టు తెలుస్తోంది. ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ(TDP) కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న లోకేశ్(lokesh) యువగళం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో భాగంగా.. లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.
డేట్ ఫిక్స్?
రేపు (ఆగస్టు 13) గన్నవరంలో కార్యకర్తలతో వెంకట్రావు సమావేశం నిర్వహిస్తారని.. తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ కార్యకర్తలతో యార్లగడ్డ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. యార్లగడ్డ వర్గీయులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు టీడీపీలోకి యార్లగడ్డతో పాటు పలువురు నేతలు వెళ్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. వైసీపీ గన్నవరం సీటు వంశీకే ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో.. యార్లగడ్డ టీడీపీ తరపున పోటీ చేస్తారంటున్నారు గన్నవరం ప్రజలు. అయితే వారం క్రితమే యార్లగడ్డ తాను జగన్తోనే ఉన్నట్టు చెప్పారు. జగన్ తనకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. వైసీపీ నుంచే సీటు ఇస్తారని ఆశిస్తున్నానని.. అమెరికా నుంచి తీసుకు వచ్చి జగన్ తనను క్రాస్ రోడ్డులో నిలబెడతారని అనుకోవటం లేదన్నారు.
వారం రోజులు ముగిసేలోపే యార్లగడ్డ మనసు మారిపోయినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీలోకి వెళ్లాలన్న ఆలోచన యార్లగడ్డకు ఎప్పటినుంచో ఉందని.. కానీ జగన్పై నమ్మకంతోనే ఇప్పటివరకు వైసీపీలో కొనసాగుతూ వచ్చారన్న ప్రచారం ఉంది. అయితే వంశీకే సీటు ఇచ్చేందుకు జగన్ మొగ్గుచూపుతున్నారన్నది బహిరంగా రహస్యమే. 2019లో వైసీపీ నుంచి పోటి చేసిన యార్లగడ్డ వంశీపై ఓడిపోయారు. టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నాళ్లకే టీడీపీపై అసంతృప్తి రాగం వినిపించిన వంశీ నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్గానే విమర్శలు గుప్పిస్తున్నారు. డైరెక్ట్గానే వైసీపీకి అండగా నిలుస్తున్నారు. ఇక రిగ్గింగ్, దొంగ ఇళ్ళ పట్టాల కారణంగానే 2019లో తాను ఓటమి పాలయ్యాని పదేపదే చెబుతూ వస్తున్నారు యార్లగడ్డ. అందుకే ఈ సారి టికెట్ తనకే ఇస్తారని చాలాసార్లు మీడియా ముఖంగా చెప్పారు. కానీ పరిస్థితులు అలా లేవని.. వంశీకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంతా భావిస్తుండడంతో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు యార్లగడ్డ సిద్ధమయ్యారని సమాచారం.