Telangana BJP CM: బీజేపీ గెలిస్తే సీఎం ఆయనేనా? ఆసక్తి రేపుతున్న అమిత్ షా ప్రకటన..!

తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా నియమిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన హాట్ డిస్కషన్‌కు తెరలేపింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే సీఎం రేసులో నిలిచేది వీరే అంటూ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే.. బీజేపీలో బలమైన బీసీ నేతలుగా వీరు ముగ్గురు చలామణి అవుతున్నారు. దీంతో వీరిలో ఎవరు సీఎం అవుతారు? అనే చర్చ నడుస్తోంది.

Telangana BJP CM: బీజేపీ గెలిస్తే సీఎం ఆయనేనా? ఆసక్తి రేపుతున్న అమిత్ షా ప్రకటన..!
New Update

Telangana BJP: ముందు నుంచి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగానే.. తెలంగాణ(Telangana)లో బీజేపీ బీసీ కార్డ్ ప్లే చేసింది. సూర్యాపేట బీజేపీ జనగర్జన వేదికగా తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కు తెరలేపింది. ఈ ప్రకటన ద్వారా బీసీలకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తూనే.. ఎన్నికల్లో బీసీ ఓట్లను లాగేందుకు ట్రై చేశారు అమిత్ షా.

అయితే, అమిత్ షా చేసిన ఈ ఒక్క ప్రకటనతో తెలంగాణ పొలిటికల్ లీడర్స్‌తో పాటు.. రాష్ట్ర ప్రజల దృష్టి ఆ ఇద్దరు నేతల వైపే మళ్లింది. అవును, బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఆ ఇద్దరివే. మరి ఆ ఇద్దరిలో ఎవరు సీఎం అభ్యర్థి. ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తుంది? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ డిస్కషన్.

ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

ఆ ఇద్దరు వీరే..

తెలంగాణకు బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామంటూ బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రకటించడమే ఆలస్యం.. అందరి దృష్టి ప్రధానంగా బండి సంజయ్, ఈటల రాజేందర్‌ వైపే మళ్లింది. బీజేపీలో లక్ష్మణ్ కూడా బలమైన నేత అయినప్పటికీ.. ముఖ్యమంత్రి రేసులో మాత్రం వీరిద్దరి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అమిత్ షా నే స్వయంగా బీసీ సీఎం అని ప్రకటించడంతో.. వీరిద్దరిలో ఎవరు సీఎం క్యాండిడేట్? అని చర్చ మొదలైంది.

అపారమైన అనుభవంతో ఈటల..

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నాటి టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఈటల రాజేందర్‌కు పరిపాలనా పరంగా ఎంతో అనుభవం ఉంది. 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరిన ఈటల రాజేందర్.. 2004 ఎన్నికల్లో క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటిచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్‌ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. 2009 ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు పోటీ చేసిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 తరువాత కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పని చేశారు. అయితే, వివిధ కారణాల చేత ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం, ఆయన బీఆర్ఎస్‌ను వీడటం, బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయాయి.

అలా కేసీఆర్‌పై ఆగ్రహంతో బీజేపీలో చేరిన ఈటల.. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు.. వచ్చే నెలలో జరుగన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు ఈటల రాజేందర్. ఇక బీజేపీలోనూ మంచి పట్టు సాధించారు ఈటల. ఆయనకు బీజేపీ అధిష్టానం.. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు అయితే.. ఈటల వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదీ బండి సంజయ్ ట్రాక్ రికార్డ్..

ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన బండి సంజయ్.. కరీంనగర్ కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి..కరీంనగర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే, ప్రతీసారి ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే, గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ఏకంగా ఎంపీగా గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంపీగానే కాదు.. తన వాక్చాతుర్యంతో పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించిన బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన వ్యూహాలు, దూకుడు, మాటల ధాటితో యావత్ తెలంగాణ సమాజాన్ని బీజేపీ వైపు ఆకర్షించేలా చేశారు. ఆయన అధ్యక్షతన ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్‌ చేసేవారు. బండి సంజయ్ దూకుడు చూసి.. ఈసారి తెలంగాణలో బీజేపీదే అధికారం అన్నంత హైప్ క్రియేట్ అయ్యింది. ఆయన అధ్యక్షత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయాలతో బండి సంజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, గ్రూప్ రాజకీయాలు, తదితర కారణాల వల్ల బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది అధిష్టానం. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఇక బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది పార్టీ. పదవి మారినా.. బండి సంజయ్ దూకుడు మాత్రం తగ్గలేదు. ఈ కారణంగానే.. ఇవాళ అమిత్ షా ప్రకటించిన బీసీ సీఎం క్యాండిడేట్ లిస్ట్‌లో సంజయ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.

సీనియర్ నాయకుడు లక్ష్మణ్..

బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన అధ్యక్షతనే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ స్థానాలను గెలుపొందింది. ఇది ఆయనకు ప్లస్ గా చెప్పుకోవచ్చు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని సమాచారం. ఈ కారణంగానే ఆయన సీఎం అభ్యర్థిత్వంపై సందేహాలు ఉన్నాయి.

ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

#telangana-elections #telangana-elections-2023 #telangana-bjp #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe