Yashasvi Jaiswal: 16ఏళ్ల నిరీక్షణకు తెర.. యశస్వీ డబుల్‌ సెంచరీతో బద్దలైన ఏళ్లనాటి రికార్డులు!

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి. 16ఏళ్ల తర్వాత భారత్ తరుఫున డబుల్ సెంచరీ చేసిన లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో భారత్ నుంచి డబుల్ సెంచరీ చేసిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

New Update
Yashasvi Jaiswal: 16ఏళ్ల నిరీక్షణకు తెర.. యశస్వీ డబుల్‌ సెంచరీతో బద్దలైన ఏళ్లనాటి రికార్డులు!

Yashasvi Jaiswal Records: ఎవరూ సెంచరీ కొట్టలేదు.. కనీసం హాఫ్‌ సెంచరీ కూడా కొట్టలేదు.. కాసేపు నిలబడినా భారీగా పరుగులు మాత్రం సాధించలేకపోయారు. కానీ ఒకడు మాత్రం 50 కాదు.. 100 కాదు.. ఏకంగా 200 పరుగులు సాధించాడు.. అందరూ ఔట్ అవుతున్నా ఒక్కడే అలా నిలబడి ఇంగ్లండ్‌ బౌలర్లను బాదిపడేశాడు. మంచి స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత్ యువ కేరటం యశస్వీ జైస్వాల్‌ (Yashasvi Jaiswal) గురించే ప్రధాన చర్చ. విశాఖ వేదికగా ఇంగ్లండ్‌పై జరుగుతున్న రెండో టెస్టులో (India Vs England) యశస్వీ జైస్వాల్‌ డబుల్ సెంచరీతో మెరిశాడు. దీంతో అతని ఖాతాలో అనేక రికార్డులు వచ్చి పడ్డాయి.


ఎన్నో రికార్డులు:
యశస్వీ అద్భుత ప్రదర్శనతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 290 బంతుల్లో 209 రన్స్ చేసిన యశస్వీ ఖాతాలో 19 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అవతలి ఎండ్‌లో బ్యాటర్లు అవుట్ అవుతున్నా యశస్వీ మాత్రం అలా నిలపడిపోయాడు. టెస్టుల్లో భారత్ తరుఫున డబుల్ సెంచరీ (Double Century) చేసిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో చేరిపోయాడు యశస్వీ. గతంలో వినోద్‌ కాంబ్లీ, సునీల్‌ గవాస్కర్‌ తక్కువ వయసులోనే డబుల్ సెంచరీ చేశారు. అగ్రస్థానంలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (21 ఏళ్ల 35 రోజులు) ఉన్నాడు. 1993లో ఇంగ్లండ్‌పై 224 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 1993లోనే జింబాబ్వేపై 227 పరుగులు చేశాడు. అప్పుడు అతని వయస్సు 21 సంవత్సరాల 55 రోజులు. 1971లో వెస్టిండీస్‌పై 220 పరుగులు చేసిన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) కాంబ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

గంభీర్‌ తర్వాత:
అంతేకాదు మయాంక్ అగర్వాల్ (నవంబర్ 2019) తర్వాత టెస్టు ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ మార్కును అధిగమించిన మొదటి భారతీయుడుగా నిలిచాడు యశస్వీ. గౌతమ్ గంభీర్ తర్వాత టెస్ట్‌లలో డబుల్ చేసిన మొదటి ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా యశస్వీనే. గంభీర్‌ 2008లో ఆస్ట్రేలియాపై 206 పరుగులు చేశాడు. అప్పటినుంచి మరో లెఫ్ట్ టీమిండియా హ్యాండర్‌ డబుల్‌ సెంచరీ సాధించలేకపోయారు.

Also Read: లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న!

Advertisment
తాజా కథనాలు