ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ-చలానా మోసగాడు.. ఎన్నికోట్లు దోచేశాడంటే

ట్రాఫిక్‌ ఈ-చలానా మోసగాడు కొమ్మిరెడ్డి అవినాష్‌ను పోలీసులు పట్టుకున్నారు. 'రేజర్‌ పీఈ' అనే నకిలీ యాప్‌ ద్వారా రూ.36.58 కోట్ల సొమ్మును తన సొంత అకౌంట్ లోకి మళ్లించుకున్నట్లు వెల్లడించారు. అవినాష్‌ కు సంబంధించిన 16 ఆస్తులను సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఈ-చలానా మోసగాడు.. ఎన్నికోట్లు దోచేశాడంటే

ట్రాఫిక్‌ ఈ-చలానా బిల్లుల విషయంలో పోలీసు శాఖకు భారీగా టోకరా వేసిన కొమ్మిరెడ్డి అవినాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ‘రేజర్‌ పే’ అనే పేమెంట్‌ గేట్‌వే ద్వారా డీజీ ఖాతాకు జమ చేస్తామని ఒప్పందం చేసుకుని కిలీ యాప్‌ సృష్టించి పెనాల్టీల డబ్బును పెద్ద మొత్తంలో దారి మళ్లించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు అవినాష్‌ కోసం ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలించి అరెస్టు చేశాయని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు విజయవాడ- గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసుస్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది. అవినాష్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని గుంటూరు ఐజీ పాలరాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో లోపాలపై డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారు. వాహనదారులకు చెందిన ట్రాఫిక్‌ పెనాల్టీ రుసుములను ‘రేజర్‌ పే’ అనే పేమెంట్‌ గేట్‌వే ద్వారా డీజీ ఖాతాకు జమ చేస్తామని ఒప్పందం చేసుకున్న అవినాష్‌ రేజర్‌ పేకు బదులు రేజర్‌ పీఈ అనే నకిలీ యాప్‌ సృష్టించి పెనాల్టీల సొమ్మును పెద్ద మొత్తంలో దారి మళ్లించారు. 2018 నుంచి 2019 జనవరి వరకు రూ.36.58 కోట్ల ఈ-చలానా సొమ్మును అవినాష్‌ తన ఖాతాకు మళ్లించుకున్నట్లు తేలిందని చెప్పారు. ఈ కేసులో ఎ2గా ఉన్న రాజశేఖర్‌ను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు అవినాష్‌ కోసం ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలించి అరెస్టు చేశాయని తెలిపారు. పోలీసు శాఖను మోసగించి మళ్లించుకున్న నగదుతో పాటు మరికొంత సొమ్ము కలిపి రూ.41 కోట్లతో అమెజాన్‌లో క్లౌడ్‌ సర్వీసెస్‌ కొనుగోలు చేసి దాని ద్వారా పలు రాష్ట్రాల్లోని కంపెనీలకు 52 రకాల సేవలు అందిస్తూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారని ఐజీ వివరించారు.

Also read : Khammam: ఖమ్మంలో అర్థరాత్రి ఉద్రిక్తత.. తుమ్మలతో ప్రాణాహాని ఉందంటున్న మాజీ పోలీస్ అధికారి..

‘అవినాష్‌కు సంబంధించి రూ.13 కోట్ల విలువైన 16 ఆస్తులు జప్తు చేశాం.. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.30 కోట్లకు పైగా ఉంటుంది. క్లౌడ్‌ సర్వీసెస్‌ సేవలకు ఆయా కంపెనీల నుంచి ఆయనకు రావాల్సిన సేవా రుసుములు మరో రూ.25 కోట్ల దాకా ఉంటాయి. దుర్వినియోగమైన రూ.36.58 కోట్లను వీటన్నింటి ద్వారా రాబట్టుకుంటాం’ అని ఐజీ పాలరాజు చెప్పారు. పోలీసుశాఖకే ఇలాంటి మోసం జరగడం దురదృష్టకరమన్నారు. రేజర్‌ పీఈ డైరెక్టర్లు మరో ఇద్దరి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నామని.. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. ‘ఈ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఈ-చలానాల వసూళ్లు నిలిపివేశాం. ఇకపై నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా చలానా రుసుములు పోలీసు శాఖకు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని వెల్లడించారు. ఇక పోలీసు శాఖకు చెందాల్సిన రూ.కోట్ల సొమ్మును తన సొంత ఖాతాలోకి మళ్లించుకుని భారీ మోసానికి పాల్పడిన అవినాష్‌ ఆ ధనంతో పెద్దమొత్తంలో స్థిర, చరాస్తులు సమకూర్చుకున్నారు.

మాజీ డీజీపీ ఎన్‌.సాంబశివరావు అల్లుడైన అవినాష్‌ 2019లో ఏపీ పోలీసు శాఖకు చెందిన ట్రాఫిక్‌ ఇ-చలానా రుసుముల కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆ తర్వాతే హైదరాబాద్‌-రంగారెడ్డి ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, విల్లాలు, ప్లాట్లు, ఖాళీ స్థలాలు కొన్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఏ2గా గుర్తించిన రాజశేఖర్‌ పేరుతో ఒంగోలులో అయిదంతస్తుల భారీ భవన నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. తెలంగాణలో మెడికల్‌ సర్వీసెస్‌ విభాగాలతో పాటు డిస్కం సంస్థలకు సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సర్వీసెస్‌ ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లో ఓ షోరూంలో కోటికి పైగా వెచ్చించి కారు కొన్నారు. తన వద్ద పనిచేసే సుమారు 30 మంది ఐటీ ఉద్యోగులకు జీతాభత్యాలు, వారికి వ్యక్తిగత రుణాలు ఈ ఖాతా నుంచే చేసినట్లు గుర్తించారు. కర్ణాటక, హైదరాబాద్‌లోని పలు బ్యాంకుల్లో రేజర్‌ పీఈ పేరుతో ఖాతాలు తెరిచారు.

Advertisment
తాజా కథనాలు