తెలంగాణలో అధికార, విపక్ష నేతలు తమ ప్రచారాల్లో మునిగిపోయారు. రోజుకో ప్రాంతం తిరుగుతూ తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచారలతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. అయితే ఎన్నికల ప్రచారాంలో భాగంగా శుక్రవారం రేవంత్ రెడ్డి నల్గొడ జిల్లాలోని నకిరేకల్లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారని అన్నారు. నల్గొండ గడ్డ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిందని.. రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులేనని వ్యాఖ్యానించారు.
Also read: బర్రెలక్కకు జాబ్.. దాడి చేసింది వాళ్లే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన మంత్రి పదవినే వదులుకున్నారన్నారు. అయితే కొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. దొరల గడీల వద్ద కాపలా కాస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ను వీడిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయ్యొద్దొని ప్రజలను కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇసుక మీద ఎవరైనా పిల్లర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తారా..? లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుంగుతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నల్గొండకు నీళ్లిచ్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు. అలాగే నల్గొండకు నీరిచ్చే 10 కిలోమీటర్ల టన్నెల్ పదేళ్లైన ఎందుకు పూర్తి కాలేదు.. తన ఫామ్ హౌస్ చుట్టు రిజర్వాయర్లు కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాకు నీరు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ ప్రశ్నించారు. నకిరేకల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వేముల వీరేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.