Pesticide: తెలంగాణలో మితిమీరిన పురుగు మందుల వాడకం.. ఎన్‌ఐఎన్‌ ఆందోళన!

దేశంలోనే తెలంగాణలో పెస్టిసైడ్స్ అతిగా వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రమాదకరమైన 11 మందులు వాడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో వ్యాధుల బారినపడే లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది.

author-image
By srinivas
New Update
nin

Telangana: పంటలకు హానీ చేసే పురుగు నివారణ మందుల వాడకం అవసరానికి మించి రైతులు వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ముఖ్యంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అతిగా వినియోగిస్తున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెస్టిసైడ్స్ వల్ల మనుషులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, శ్వాస సంబంధిత, చర్మ, తదితర వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో పేర్కొంది. ఈ మేరకు ICMR, NIN సంస్థలు నిర్వహించిన ‘దేశం, తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం నివేదిక’అనే సర్వేలో వరి, పత్తి రైతులే పురుగు మందులు అతిగా వాడుతున్నట్లు వెల్లడైంది.

రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గిపోయి..
18–70 ఏళ్ల వయసున్న వారిపై చేపట్టిన సర్వేలో.. కనీసం ఏడాదిపాటు పెస్టిసైడ్స్ పిచికారీ చేసిన వారు అనారోగ్యం బారిన పడుతున్నట్లు గుర్తించారు. యుక్త వయస్కుల్లో ఎత్తు, బరువుపై ఈ మందులు ప్రభావం చూపిస్తుండగా.. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గిపోతున్నట్లు తెలిపారు. అలాగే మందులపై అవగాహన రాహిత్యం కారణంగా విరివిగా వాడుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని, ఇటీవల సేకరించిన రక్తం, మూత్ర నమూనాల ఆధారంగా కేన్సర్, అల్జీమర్స్‌ వ్యాధులకు గురువుతున్నట్లు ఎన్ఐఎన్ ఆందోళన వ్యక్తం చేసింది.

11 మందులు అత్యంత ప్రమాదకరం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పంటలకు వాడే 28 రకాల పురుగు మందుల్లో 11 మందులు అత్యంత ప్రమాదకరమైనవి. రైతుల రక్త, మూత్ర నమూనాల్లో ఈ మందుల అవశేషాలు బయటపడ్డాయి. నిషేధిత రసాయనాలు కూడా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్‌ తదితర ఇబ్బందుల పాలవుతున్నట్లు తెలిపారు. రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. పిల్లలపై కూడా ఈ పురుగు మందుల ఎఫెక్ట్ పడుతున్నట్లు వెల్లడించారు.

ఒట్టి చేతులతో కలపడం వల్ల అనేక రోగాలు..
తెలంగాణలోని యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్‌ సెక్షనల్‌ సర్వే నిర్వహించగా.. అవగాహన లేకపోవడంతో మితిమీరిన పురుగు మందుల వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నట్లు వెల్లడైంది. పురుగుమందులను కలిపేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒట్టి చేతులతో కలపడం వల్ల అనేక రోగాలు వస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 36 శాతం మంది మాత్రమే అవగాహన కలిగివున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీరు మాత్రమే మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు