/rtv/media/media_files/2025/08/05/komatireddy-rajagopal-reddy-2025-08-05-15-57-49.jpg)
Komatireddy Rajgopal Reddy
Komatireddy Rajgopal Reddy:
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి రాకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నానని కొందరు అంటున్నారని ఫైర్ అయ్యారు.
ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని గతంలో పార్టీ చెప్పిందన్నారు. కానీ తాను మాత్రం మునుగోడులోనే పోటీ చేస్తానని స్పష్టం చేశానన్నారు. తనలాంటి వాడికి పదవులు వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చానన్నారు. ప్రజల కోసం మళ్లీ రాజీనామాకు సిద్ధమన్నారు. తనకు పదవుల కన్నా ప్రజలే ముఖ్యమన్నారు. వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలన్నారు.
మంత్రి పదవి ఇస్తా అంటేనే తాను కాంగ్రెస్ లోకి మళ్లీ వచ్చానన్నారు. జూనియర్ లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెట్టారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇది వాళ్ళ విజ్ఞత అని అన్నారు. మునుగోడు అభివృద్ధి తన బాధ్యత అని అన్నారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదన్నారు. మంత్రి పదవి కావాలా? మునుగోడు ప్రజలు కావాలా? అంటే తనకు మునుగోడు ప్రజలే కావాలని చెబుతానన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని నాటి నుంచి పార్టీపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా సీరియస్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ టార్గెట్ గా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇటీవల మరో పదేళ్లు తానే సీఎం అని రేవంత్ అంటే.. ఇలా చెప్పుకోవడం కాంగ్రెస్ విధానం కాదని కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. సోషల్ మీడియా జర్నలిస్టులపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవడంపై కూడా రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇది కరెక్ట్ కాదంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.