/rtv/media/media_files/2026/02/05/janasena-2026-02-05-21-09-55.jpg)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన మద్దతు తీసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందేమోనన్న ఆందోళన మెజారిటీ బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
కమలనాథులకు తలనొప్పిగా
ముఖ్యంగా, బీజేపీలో టికెట్లు ఆశించి భంగపడ్డ కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి జనసేన తరపున బరిలోకి దిగడం ఇప్పుడు కమలనాథులకు తలనొప్పిగా మారింది. కొన్ని వార్డుల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు నేరుగా తలపడుతుండటంతో.. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే, ఎవరికి ఓటు వేయమని అడుగుతారనేది ప్రధాన ప్రశ్నగా మారింది. బీజేపీ అభ్యర్థులకా? లేక తన పార్టీ అభ్యర్థులకా? అన్న డైలమా ఇరు పార్టీల నేతలను వేధిస్తోంది.
ప్రస్తుతానికి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ వెలువడినప్పటికీ, బీజేపీ తరపున దానికి సంబంధించిన స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. పవన్ ప్రచారం వల్ల ఓట్లు చీలిపోతాయని, ఇది చివరకు ప్రత్యర్థి పార్టీలకు లాభిస్తుందని కొందరు నేతలు అధిష్టానం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేనాని ప్రచార పర్యటనను కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై టీ-బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
Follow Us