Telangana Bandh: నేడు తెలంగాణ బంద్.. బస్సులు, దుకాణాల నుంచి స్కూళ్లు, కాలేజీల వరకు అన్నీ క్లోజ్!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ చేస్తూ నేడు బీసీ సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. రిజర్వేషన్ లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈరోజు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

New Update
telangana bandh

Telangana Bandh :  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ చేస్తూ నేడు బీసీ సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈరోజు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది.ఈ బంద్‌కు అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, పలు ప్రజాసంఘాలు మద్దతు తెలపడంతో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని బీసీ జేఏసీ ముందుగానే  కోరడంతో స్కూల్స్‌కు ఆయా యజమాన్యాలు సెలవు ప్రకటించాయి. వ్యాపార వర్గాలు కూడా బంద్‌కు సానుకూలత వ్యక్తం చేశాయి. కాగా, బంద్‌కు టీజీఎస్‌ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా సుముఖత వ్యక్తం చేసినప్పటికీ మధ్యాహ్నం తరువాత బస్సులు నడపాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచే బస్‌ డీపోల ఎదుట బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వేలాది బస్సులు డిపోలకే పరిమితమవ్వడంతో అత్యవసర పనుల నిమిత్తం ఊర్లకు వెళ్లాలనుకుని బస్‌ స్టాండ్‌లకు చేరుకున్న పలువురు ప్రయాణీకులు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే బీసీ బంద్‌ నేపథ్యంలో ప్రయాణీకులు తమ  ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

 కాగా, బీసీల బంద్‌కు అధికార కాంగ్రెస్‌ పూర్తి మద్దతునిస్తుంది. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలంతా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు. బంద్‌ నేపథ్యంలో ఉదయం నుంచే బీసీ నేతలు రోడ్లమీదకు వచ్చి ఆందోలనలకు సిద్ధమయ్యారు. ఈ రోజు బంద్‌లో వైన్స్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా మూసివేస్తున్నట్లు ఆయా వర్గాలు ప్రకటించాయి.  ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు వంటి అత్యవసర విభాగాలు మినహాయించి అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి.

 శనివారం తెల్లవారుజామున5 గంటల నుంచే బంద్‌ ప్రభావం కనిపించడంతో రోడ్లన్ని నిర్మానుషంగా మారిపోయాయి. అయితే బంద్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో టాక్సీలు, కార్లు, ఆటోవాలాలు రేట్లు పెంచి వాహనాలు నడుపుతున్నారు. జేబీఎస్‌ నుంచి బస్సులు బంద్‌ కావడంతో కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ వెళ్లా్ల్సిన ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌ కు రూ.400 నుంచి  రూ.500 తీసుకునే కార్ల యజమానులు ఈ రోజు రూ.1000 వరకు వసూలు చేస్తుండంతో అత్యవసర పనులకు వెళ్లా్ల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. బంద్‌ రోజు రాష్ట్ర ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని బీసీ సంఘాలు కోరుతున్నాయి. కాగా బంద్‌లో భాగంగా అంబర్‌ పేటలోని ప్రధాన రహదారిలో జరిగిన బంద్‌ కార్యక్రమంలో పీసీసీ ప్రెసిడెంట్‌  మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సీనియర్‌ నేత వి. హన్మంతరావు తదితరులు  పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని రేతిబౌలి బస్‌స్టాండ్‌ వద్ద బంద్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీగణేష్‌ పాల్గొన్నారు. ఇమ్లీబన్‌ బస్‌ స్టేషన్‌ వద్ద మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌తో పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. పలు పార్టీల నేతలు రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తుండటంతో బంద్‌ ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. 

Also Read: అఫ్గాన్, భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. పాక్‌ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు