/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t081700-2026-01-21-08-17-24.jpg)
Suspicious man beats wife to death with pestle
Murder: అనుమానం ఆ భర్తను ఉన్మాదిగా మార్చింది. ఆనందంగా సాగాల్సిన కుటుంబంలో అనుమానం కలతలకు కారణమైంది. దీంతో సహనం కోల్పోయిన భర్త రోకలిబండతో భార్యను కొట్టి చంపాడు. ఈ దారణం హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా చింతకుంట కు చెందిన రొడ్డె ఆంజనేయులుకు కొల్లాపూర్కు చెందిన సరస్వతితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చిను కుటుంబం రహమత్నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్గాంధీనగర్లో ఓ భవనంలో అద్దెకు దిగారు.
ఆంజనేయులు ఆంజనేయులు కారు డ్రైవర్గా పనిచేస్తూనే కొంతమందితో కలిసి జూబ్లీహిల్స్లో కార్ల క్రయవిక్రయాల వ్యాపారం చేస్తున్నాడు. సరస్వతి హైటెక్ సిటీ ప్రాంతంలోని ఒక కంపెనీలో హౌస్కీపింగ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య సరస్వతిపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు తరుచూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ ఓపెన్ చేసి అన్నీ పరిశీలిస్తూ, ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి ఏం చేస్తుందని గమనించేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు పెరిగాయి. ఉద్యోగం మానేసి జులాయిగా తిరగసాగాడు. సరస్వతి పలుమార్లు జాబుకు వెళ్లాలని సూచించినా ప్రయోజనం లేకపోయింది. డబ్బుల్లేకపోవడంతో పిల్లలను సైతం బడికి పంపడం మాన్పించేశారు. అయినా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో నీతో బతకలేనంటూ ఇటీవల పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆంజనేయులు తన అత్తగారింటికి వెళ్లి, భార్య తరఫు పెద్ద మనుషులతో మాట్లాడి, గొడవలు పెట్టుకోనని నచ్చజెప్పి ఈనెల 17న భార్య, పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం విధులు ముగించుకొని వచ్చిన సరస్వతి.. పిల్లలకు భోజనం పెట్టి పడుకుంది.
అయితే భార్యపై కక్ష మాత్రం తగ్గలేదు. సోమవారం అర్ధరాత్రి తన పిల్లలతో కలిసి గాఢనిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకలితో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే నిద్రపోయిన పిల్లల దుస్తులు సైతం రక్తంతో తడిసిపోయాయి. ఆ సమయంలో వారిద్దరూ నిద్రలేవడంతో.. అమ్మ పడుకుంది.. మీరు నిద్రపోండి అని ఆంజనేయులు బయటికి వెళ్లిపోయాడు. ఆ వెంటనే భయంతో పిల్లలు నిద్రలేచి లైట్ వేసి తల్లి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూశారు. వెంటనే సమీపంలో ఉంటున్న మేనమామ సుధాకర్కు ఫోన్చేసి చెప్పారు. ఆయన అక్కడికి చేరుకొని 100కు సమాచారం అందించారు.హత్య అనంతరం ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆంజనేయులు హత్య చేసిన అనంతరం తన స్టేటస్లో ‘నా జీవిత భాగస్వామిని నేనే నా చేతులారా చంపుకున్న’అంటూ ఫొటో స్టేటస్ పెట్టుకోవడం గమనార్హం. ఆంజనేయులు గతంలో సరస్వతి మరో సోదరుడైన ప్రశాంత్ను కత్తితో గాయపరచడంతో కేసు నమోదైనట్లు సమాచారం. సరస్వతి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం బోరబండ పోలీసులు గాలిస్తున్నారు.
Follow Us