/rtv/media/media_files/ei2Wb7uqtyTM7c9GQUhd.jpg)
cm revanthreddy
Sarada Peetham : వివాదం నెలకొన్న కోకాపేట శారదా పీఠం భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. శారధా పీఠానికి కేటాయించిన భూములను జలమండలికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, దానిపై మాజీమంత్రి హరీశ్రావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పీఠం భూములను జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న పీఠం నిర్మాణ పనుల విషయాలను ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు. జల మండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని ముఖ్యమంత్రి, పీఠం ప్రతినిధులకు సూచించారు.
అసలేం జరిగిందంటే..
కాగా కోకాపేట్ నియోపోలిస్లోని శారదా పీఠం భూములను జలమండలి కి అదనంగా 3.95 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న 8.75 ఎకరాలు ఎంబీఆర్ (MBR), ఈఎల్ఎస్ఆర్ (ELSR)ల నిర్మాణానికే సరిపోతాయని స్పష్టం చేసింది. ఓహెచ్టీ (OHT), సైట్ ఆఫీస్, మెయింటెనెన్స్ కోసం అదనపు భూమి అవసరమని తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపగా పీఠానికి కేటాయించిన భూమిని జలమండలికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/28/fotojet-18-2026-02-28-21-16-34.jpg)
హరీశ్రావు ఎంట్రీతో...
అయితే కోకాపేట్ నియోపోలిస్లో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన స్థలంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆ స్థలాన్ని జలమండలికి కేటాయించడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయమే ఆలయం వద్దకు చేరుకున్నారు. శారదా పీఠానికి కేటాయించిన రెండు ఎకరాలు ఎందుకు లాక్కుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మఠానికి భూములు కేటాయించారనే కక్షతోనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సీఎంకు దేవుడు మీద నమ్మకం లేకపోవచ్చని.. మంత్రి శ్రీధర్ బాబు అయినా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. దీనిపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow Us