/rtv/media/media_library/vi/CPPnFJ9R_hY/hqdefault-238057.jpg)
Private Colleges Bandh Due to Fee Reimbursement
 Private Colleges Bandh Due to Fee Reimbursement : రాష్ట్రంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సోమవారం నుంచి బంద్ పాటించనున్నట్టుగా తెలిపాయి. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బంద్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ సంస్థలు తెలిపాయి. ఈ మేరకు నేటి నుంచి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది. 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్లో విద్యాసంస్థలు నిరసనలు చేపట్టాయి. అయితే ఈ మొత్తంలో రూ. 1200 కోట్లు రెండు విడతల్లో ఇస్తామని దసరా సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక మిగతా రూ. 7,200 కోట్లను కూడా మార్చి 2026 నాటికి చెల్లించేలా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు చెల్లించలేదు. ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాట పట్టాయి
 
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్కు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ఫీజూ బకాయిలు చెల్లించని కారణంగా కాలేజీలు నడపలేకపోతున్నామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో తక్షణమే బకాయిల్లో 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, బంద్ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించినట్టు విద్యాసంస్థలు తెలిపాయి. ఈ క్రమంలో పలు కళాశాలల యాజమాన్యాలు ఆదివారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులకు బంద్ నేపథ్యంలో కళాశాలలు పనిచేయవని సంక్షిప్త సందేశాలు పంపాయి.  
 
మొదటి విడతలో కేవలం రూ. 300 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. మిగిలిన రూ. 900 కోట్లను దీపావళి నాటికి చెల్లించాల్సి ఉంది. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి సమాఖ్య విజ్ఞప్తి చేసింది. నవంబర్ 1 కి డెడ్లైన్ విధించింది. నవంబర్2 న సానుకూల నిర్ణయం తీసుకుంటే బంద్ నిర్ణయాన్ని విరమించుకుంటామని తెలిపింది. అయితే నిన్న కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్చించిన యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 6న లక్ష మంది సిబ్బందితో సభ, 10 వ తేదీన పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్, ‘చలో సెక్రటేరియట్’ వంటి కార్యక్రమాలకు సిద్ధమైనట్లు యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ నెల 4 న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని తెలిపాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
 Follow Us