Telangana Floods: వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు.. రూ.558.90 కోట్ల నష్టం

తెలంగాణలో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాటిల్లిన నష్టంపై శాఖల అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నారు. 28 జిల్లాల్లోని 270 మండలాల్లో పంట నష్టం చోటుచేసుకుంది. కామారెడ్డిలో వరదల కారణంగా రూ.130 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.

New Update
Telangana Floods

Telangana Floods

వర్షాలు తగ్గినా.. వరదలు శాంతించినా.. అవి మిగిల్చిన నష్టం బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. శుక్రవారం వర్షం తగ్గినా.. గ్రామాలు వరద నీటి నుంచి బయటపడలేదు. కామారెడ్డిలో వరదల కారణంగా రూ.130 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 33వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

 మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తి నిజామాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామీణ అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికితోడు భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాయి.

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాటిల్లిన నష్టంపై శాఖల అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నారు. 28 జిల్లాల్లోని 270 మండలాల్లో పంట నష్టం చోటుచేసుకుంది. 1.09 లక్షల ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాల్లో పత్తి, 16 వేల ఎకరాల్లో మొక్కజొన్న ఇతర పంటలు కలిపి 2.20 లక్షల ఎకరాల్లో నష్టం చోటుచేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో 480 చెరువులు, కుంటలు, కాలువలకు నష్టం వాటిల్లింది. మరమ్మతులకు  రూ.100 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. రోడ్లు-భవనాల శాఖ పరిధిలో 784 ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయి మరమ్మతులకు దాదాపు రూ.558.90 కోట్లతో అంచనాలు సిద్ధం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు