/rtv/media/media_files/2025/01/22/YIMG3Jf2Xg62BxNaVMY1.jpg)
bhatti vs uttam Photograph: (bhatti vs uttam )
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 జనవరి 26వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నాలుగు స్కీమ్ లకు శ్రీకారం చుట్టబోతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా పథకాలను రేవంత్ సర్కార్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. అయితే ఇందులో రేషన్ కార్డుల జారీ విషయంలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తలో మాట చెప్పడం ఇప్పుడు లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప ఆ తరువాత తెలంగాణ ఏర్పాడ్డాక బీఆర్ఎస్ సర్కార్ ఆరకోర రేషన్ కార్టులు మంజూరు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన చేయడంతో చాలా మంది వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో చాలామంది ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు మంత్రుల ప్రకటన ఆశావాహుల్లో ఆందోళనను రేకెత్తిస్తుంది.
రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం
రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం 40 వేల రేషన్కార్డులే ఇచ్చిందని దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయనుందని తెలిపారు. పాత కార్డులను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పిన మంత్రి.. అవసరమైతే అందులోనే కుటుంబ సభ్యుల పేర్లు చేరుస్తామని చెప్పారు. రేషన్ కార్డులు లేని ప్రతిఒక్కరూ గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నామని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అంతకుముందు ఓ సభలో మంత్రి ఉత్తమ్ కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నామని ప్రకటించడం.. ఇప్పుడు 40 లక్షలు అని చెప్పడంతో గందరగోళం నెలకొంది.
మంత్రి ఉత్తమ్ మాటలు ఇలా ఉంటే మరో మంత్రి భట్టి మాటలు మరోలా ఉన్నాయి. ఓ సభలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అంటూనే ప్రజా ప్రభుత్వం కొత్తగా 10లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయనుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలా మంత్రలలో వారికే క్లారిటీ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారో తెలియాలంటే జనవరి26 వరకు ఆగితే తెలిసిపోతుంది.