/rtv/media/media_files/2025/07/24/govrnor-2025-07-24-18-54-15.jpg)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో న్యాయసలహా కోసం గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆర్టినెన్స్ ను కేంద్ర హోంశాఖకు పంపారు. ఆర్టినెన్స్ పై అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులతో చర్చల అనంతరం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్లను గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపవచ్చు. కేంద్ర హోంశాఖ న్యాయ నిపుణులతో సంప్రదించి, ఆ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతపై తమ సలహాను గవర్నర్కు తెలియజేస్తుంది. ఆ సలహా ఆధారంగా గవర్నర్ ఆర్డినెన్స్ను ఆమోదించాలా? లేదా తిరస్కరించాలా? అనే నిర్ణయం తీసుకుంటారు.
రేపటితో ముగియనున్న గడువు
ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. హైకోర్టు గత ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం రేపటి లోగా ఖరారు చేయాల్సి ఉంది. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్టినెన్స్ కేంద్ర హోంశాఖ వద్ద ఉంది. 24 గంటల్లో కేంద్ర హోంశాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది బిగ్ క్వశ్చన్. ఒకవేళ కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి హైకోర్టును ఆశ్రయించి మరింత గడువు కోరడం లేదా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు ముందుకు వెళ్లడం.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే రేవంత్ సర్కార్ పలుమార్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందన్నది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై కేంద్రం సైతం ఇంత వరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతోంది. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ రాంచందర్ రావుతో పాటు, ఎంపీ రఘునందన్ రావు తేల్చిచెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేనట్లుగానే కనిపిస్తుంది.