/rtv/media/media_files/2025/06/10/onC3OYimRCbCvZPCbzZ0.jpg)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేపు బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. కేసీఆర్ ను విచారిస్తే దాదాపుగా విచారణ పూర్తి అవుతుంది. బుధవారం(జూన్ 11) ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని ఇప్పటికే కేసీఆర్ కు ఆదేశాలందాయి. విచారణకు హాజరు కాబోతున్న కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించేందుకు కమిషన్ కూడా పకడ్బందీగా సిద్ధం అవుతోంది. కమిషన్ కేసీఆర్ పై ఎలాంటి ప్రశ్నాలను సంధించబోతుంది. ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారు. విచారణ అనంతరం కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ బల ప్రదర్శన
విచారణకు ఎదురుకోవడానికి సిద్ధమేనంటున్న బీఆర్ఎస్ దీన్ని బల ప్రదర్శనకు వేదికగా వాడుకుంటుంది. కేసీఆర్ కు భారీ స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 500 కాన్వాయ్ తో, నాయకుల మద్దతుతో కేసీఆర్ ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ నుంచి బయలుదేరనున్నారు. దారి పొడుగున ఆయనకు మద్దతు పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఉదయం 11గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. హరీష్ రావు విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందున్న రోడ్డును పోలీసులు పూర్తిగా బ్లాక్ చేశారు. ఇక కేసీఆర్ విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ నుంచి సచివాలయం రోడ్డు వరకు పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది.
కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భారీగా అవినీతిని జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ .. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు , ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలంటూ వారికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హరీష్ రావు, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు.
హరీష్ విచారణలో ఓ నివేదికను కూడా సమర్పించారు. విచారణ అనంతరం నేరుగా కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లిన హరీష్...కేసీఆర్ తో భేటీ అయ్యారు. విచారణకు సంబంధించిన అంశాలను ఆయనతో సుధీర్ఘంగా చర్చించారు. తాజాగా ఇవాళ కూడా మరోసారి కేసీఆర్ తో సమావేశమయ్యారు హరీష్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ కేసీఆరే అని పార్టీ చెప్పుకొచ్చింది. తన మెదడు కరిగించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపొందించాచని కేసీఆర్ కూడా పలు వేదికలపైనే అన్నారు. మరి విచారణలో కేసీఆర్ ఏం సమాధానాలు ఇస్తారో చూడాలి. విచారణ అనంతర తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని సమాచారం.