/rtv/media/media_files/2025/11/14/telangana-2025-11-14-06-36-34.jpg)
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నిక జరిగింది, ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుండడంతో అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నవంబర్ 11న జరిగిన పోలింగ్లో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారనే విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నిక ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరుగా మారింది. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావించడంతో, ముఖ్య నాయకులు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో
ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఫలితాలను 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్కు సుమారు 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
186 మంది సిబ్బంది
కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.
అప్డేట్స్ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.
Follow Us