/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t075212-2026-01-14-07-52-46.jpg)
Indira Devi Dhanrajgir
Indira Devi Dhanrajgir: ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్గిర్(96) హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలోని జ్ఞాన్బాగ్ ప్యాలెస్లో కన్నుమూశారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. దక్షిణాదిలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన ధన్రాజ్గిర్ వారసురాలు అయిన రాజకుమారి ఇందిరాదేవి చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి. అల్లా ఇక్బాల్, గాలీబ్, అరబిందో రచనల నుంచి ప్రేరణ పొందిన ఇందిరాదేవి సాహిత్యం వైపు మళ్లారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు జ్ఞాన్ బాగ్ ప్యాల్స్లో తుదిశ్వాస విడిచారు.
నిజాం సంస్థాన సలహాదారుడు రాజా ధన్రాజ్గిర్, రాణి ప్రమీలా దేవిలకు 1930, ఆగస్టు17న ముంబైలో ఇందిరా దేవి జన్మించారు. చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్కు వచ్చింది. తొలుత ఇక్కడే మెహబూబియా బాలికల పాఠశాలలో హైస్కూల్ విద్య అభ్యసించారు. అనంతరం ఆమె ఇల్లు అయిన జ్ఞాన్ బాగ్ ప్యాలెస్సే ఆమె విద్యాలయంగా మారింది. ఇంటి నుంచే ఉన్నత విద్యాభ్యాసం చేశారు. రాజకుమారి ఇందిరాదేవి యుక్తవయసు నుంచీ ఫొటోగ్రఫీపై ఆసక్తితో ఫొటోల సేకరణ మొదలుపెట్టారు. ఇక్బాల్ ప్రేరణతో చిన్న వయసులోనే సాహిత్యాభిమానిగా మారారు. తండ్రి రాజా ధన్ రాజ్గిర్ సాహిత్యాభిమాని కావడంతో బాల్యం నుంచి ఆంగ్ల, హిందీ, ఉర్దూ, మరాఠా సాహితీవేత్తలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అలా ఆమె తొమ్మిదో ఏటనే రచనలు రాయడం ప్రారంభించారు.
1964లో ఆమె మొదటి కవితా సంపుటి ‘ది అపోసల్’ పేరుతో ప్రచురించారు. 1965, 1966లలోనూ ఆమె పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ముంబై, పూణె, ఊటీ, హైదరాబాద్ నగరాల్లో వీరికి రాజ ఠీవీని ప్రతిబింబించే అందమైన ప్యాలెస్లున్నాయి. హైదరాబాద్ వారసత్వ కట్టడాల్లో ఒకటైన జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ వీరి పూర్వీకులు యూరోపియన్ శైలిలో 1890లో నిర్మించారు. ప్రస్తుతం ఆమె అందులోనే తుదిశ్వాస విడిచారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీకి తొలి అధ్యక్షురాలిగా, ఉర్దూ అకాడమీ ఛైర్పర్సన్గా పనిచేశారు. 1973లో వరల్డ్ పోయెట్రీ సొసైటీ ఇంటర్కాంటినెంటల్ (డబ్ల్యూపీఎస్ఐ) అధ్యక్షుడు కృష్ణ శ్రీనివాస్ ఆమె పేరును సాహిత్యంలో నోబెల్కు నామినేట్ చేశారు. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ మహిళగా ఆమె పేరు గాంచారు.సాహితీ వేత్తలతో వారి కుటుంబానికి ఉన్న పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఉర్దూలో ఆమె ద్విపదులు రాశారు. ‘ రిటర్న్ ఎటర్నిటీ, పోయెమ్స్ ఆఫ్ మై నేషనల్ మెమోరీ, విండ్ బ్లోస్ ఫ్రమ్ స్కా ఫోల్డ్ తదితర 12 పుస్తకాలు ఇందిరా దేవి రాశారు. తన కుటుంబ వారసత్వ చరిత్రను ‘‘మెమోరీస్ ఆఫ్ ది దక్కన్ ‘‘ పేరుతో కాఫీటేబుల్ బుక్ గా ప్రచురించారు. ఆమె రాసిన కొన్ని ఆంగ్ల కవితలను ప్రముఖ కవి ముగ్థుమ్ ఉర్థూ లోకి అనువదించారు.
నేడు అంత్యక్రియలు
ఇందిరాదేవి చిత్రకారిణి కూడా. ముంబైలో ఎం.ఎఫ్. హుస్సేన్ సారథ్యంలో ఇందిర గీసిన చిత్రాలతో 1970వ దశకంలో ఒక ప్రదర్శన నిర్వహించారు. శేషేంద్ర శర్మతో వివాహానంతరం ఆమె కవిత్వ రచనకు విరమణ ప్రకటించారు. శేషేంద్ర వల్ల తెలుగు సాహితీ సమాజంతో ఇందిరదేవికి పరిచయం ఏర్పడింది. శేషేంద్ర రాసిన పది వేల ఉత్తరాలతో నాచారంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులో నాలుగు వేల పోస్టు కార్డులు ఉండడం విశేషం. గుంటూరు శేషేంద్ర శర్మ రచనలపై ఆయన సంతతికి, ఇందిరాదేవికి మధ్య వివాదం నడిచింది. న్యాయపోరాటంలో ఆమెకు ప్రతికూలంగా ఫలితం వచ్చింది. జాతీయ ఉర్దూ కవులతో పాటు కవి సమ్రాట్ విశ్వనాథతోనూ ఇందిరాకు ఆత్మీయానుబంధం ఉందని చెబుతారు. ఇందిరాదేవి ధన్ రాజ్గిర్ అంత్యక్రియలు బుధవారం ఉదయం అంబర్పేట శ్మశాన వాటికలో జరుగుతాయని మహేష్ విశ్వనాథ తెలిపారు. ఆమె తుది కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా తెలుగు వైదిక సంప్రదాయం ప్రకారం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తమ్ముడు రాంమ్మూర్తి కుమారుడు విశ్వనాథ శోభనాద్రి చేతుల మీదగా అంతిమ సంస్కారాలు నిర్వహిచనున్నట్లు తెలిపారు.
Follow Us