/rtv/media/media_files/2025/01/28/Va98jt5WVjFAdkdgarqj.webp)
Hussain Sagar Boat Burning
Hussain Sagar Boat Burning : నగరంలోని హుస్సేన్ సాగర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం ఘటనలో ఒకరు మృతిచెందారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో జరిగిన 'భారత మాతకు మహా హారతి' కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలడం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గణపతికి 80 శాతం కాలిన గాయాలవ్వడంతో ఆరోగ్యం విషమించి చనిపోయాడని వైద్యులు తెలిపారు. గణపతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం. మరోవైపు రెండు రోజులవుతున్నా ఈ ఘటన తరువాత అదృశ్యమైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
భారతమాత ఫౌండేషన్ ఆదివారం రాత్రి మహాహారతి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో బాణసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అజయ్ అనే బీటెక్ విద్యార్ధి గల్లంతయ్యాడు. అజయ్ జాడ కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు వెతికినా ఫలితం లేకపోయింది. కాగా ఘటనలో అజయ్ గల్లంతవడంతో ఆయన తల్లిదండ్రలు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజానికి ఈ కార్యక్రమానికి స్నేహితునితో వచ్చి అజయ్ మిస్సవ్వడం కలకలం రేపుతోంది.
మహాహారతి కార్యక్రమంలో బాణాసంచా కాల్చడానికి ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మణికంఠ కాంట్రాక్టు తీసుకున్నాడు. అతడికి బాణసంచా సరఫరా చేసిన వ్యక్తి.. తనకు రావాల్సిన డబ్బులకోసం మణికంఠ వద్దకు వెళ్లమని చేర్యాల్ గీతాంజలి కాలేజ్లో బీటెక్ చదువుకుంటున్న సాయిచంద్, గణపతికి చెప్పాడు. అదే కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న అజయ్ను కూడా వారు తమతో పాటు మణికంఠ వద్దకు తీసుకెళ్లారు. హుస్సేన్సాగర్లో ఓ బోటులో ఉండి బాణసంచా కాలుస్తున్న మణికంఠ... సాయిచంద్, గణపతి, అజయ్లను తనవద్దకు రావాలని చెప్పి మరో బోటును పంపాడు. మణికంఠ వద్ద వారు డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే నిప్పు రవ్వలు వచ్చి సాయిచంద్, గణపతి, అజయ్ ఉన్న బోటులో పడ్డాయి. ఆ బోటులో కూడా బాణసంచా ఉండడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ బోటులో ఉన్నవారందరూ హుస్సేన్సాగర్లో దూకేశారు. వారికి లైఫ్జాకెట్లు కూడా లేవు. వీరిలో అజయ్ మాత్రం గల్లంతయ్యాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి.